ఎన్‌ఎంపీతో కేంద్రానికి రూ.33,422 కోట్లు

22 Nov, 2022 06:34 IST|Sakshi

2022–23లో లక్ష్యాన్ని చేరే అవకాశాలు లేనట్లే!

రూ.17,000 కోట్లతో బొగ్గు మంత్రిత్వశాఖ ముందడుగు  

న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆస్తుల ద్వారా ఆదాయాల (నేషనల్‌ మోనిటైజేషన్‌ పైప్‌లైన్‌– ఎన్‌ఎంపీ) అన్వేషణ పథకం కింద కేంద్రానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) ఇప్పటి వరకూ కేంద్రానికి రూ.33,422 కోట్లు ఒనగూడింది. ఇందులో రూ.17,000 కోట్లతో బొగ్గు మంత్రిత్వశాఖ ముందడుగులో ఉండగా, పోర్ట్స్‌ అండ్‌ షిప్పింగ్‌ మంత్రిత్వశాఖ తన ఆర్థిక సంవత్సరం లక్ష్యాలను అధిగమించే స్థాయికి చేరుకుంది.  అధికార వర్గాల తాజా సమాచారం ప్రకారం, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నవంబర్‌ 14న నీతి ఆయోగ్‌ సీఈవో పరమేశ్వరన్‌ అయ్యర్‌తో జరిగిన సమావేశంలో ఎన్‌ఎంపీ అమలు పురోగతిని సమీక్షించారు. ఈ సమీక్ష అంశాలపై అందిన సమాచారం క్లుప్తంగా...

► 2021–22లో ఎన్‌ఎంపీ ద్వారా ప్రభుత్వ సమీకరణ లక్ష్యం రూ.88,000 కోట్లు. అయితే రూ. 1 లక్ష కోట్ల విలువైన లావాదేవీలను పూర్తి చేయడం ద్వారా లక్ష్యాన్ని అధిగమించింది.  
► 2022–23లో లక్ష్యం రూ.1,62,422 కోట్లు. అయి­తే లక్ష్యాలను చేరకపోవచ్చన్నది ప్రభుత్వ తా­జా అంచనా. లక్ష్యానికి రూ.38,243 కోట్ల దూరంలో ఉండవచ్చని భావిస్తున్నారు. రూ.1,24,179 కో ట్ల అసెట్‌ మోనిటైజేషన్‌ జరగవచ్చని భావిస్తోంది.  
► బొగ్గు మంత్రిత్వ శాఖ, గనుల మంత్రిత్వ శాఖ, ఓడరేవులు–షిప్పింగ్‌ మంత్రిత్వ శాఖలు అసెట్‌ మానిటైజేషన్‌ లక్ష్యాన్ని అధిగమించే అవకాశం ఉంది. రోడ్డు రవాణా– రహదారుల మంత్రిత్వ శాఖ కూడా లక్ష్యాలను చేరుకునే వీలుంది.  
► విద్యుత్, రైల్వే, పౌర విమానయాన మంత్రిత్వ శాఖలు అలాగే చమురు– గ్యాస్‌ మంత్రిత్వ శాఖ లక్ష్యం నెరవేరే అవకాశం లేదు.  
► రైల్వేల లక్ష్యం రూ.30,000 కోట్లయితే, ఇప్పటికి ఒనగూరింది రూ.1,829 కోట్లు.
► విద్యుత్‌ మంత్రిత్వశాఖ విషయంలో లక్ష్యం రూ.15,000 కోట్లయితే, ఇప్పటికి లక్ష్యంలో రూ.2,000 కోట్లకు చేరుకోవడం జరిగింది.  
► బొగ్గు మంత్రిత్వశాఖ లక్ష్యం రూ.30,000 కోట్లయితే, ఇప్పటికి రూ.17,000 కోట్ల విలువైన మానిటైజేషన్‌ జరిగింది. రోడ్డు, ట్రాన్స్‌పోర్స్, హైవేల శాఖ లక్ష్యం రూ.32,855 కోట్లయితే, ఇప్పటికి రూ.4,100 కోట్ల సమీకరణ జరిగింది.  
► మోనిటేజేషన్‌ లక్ష్యాల సాధనకు ఆస్తులను గుర్తించవలసినదిగా వివిధ మంత్రిత్వశాఖలను ఆర్థికశాఖ కోరింది.
► వివిధ రంగాల్లో మౌలిక ఆస్తుల విలువలను గుర్తించడం, తద్వారా నాలుగేళ్ల కాలంలో ఈ ఆస్తుల ద్వారా రూ. 6 లక్షల కోట్ల సమీకరణ లక్ష్యంగా 2021 ఆగస్టులో ఆర్థికమంత్రి సీతారామన్‌ ఎన్‌ఎంపీ స్కీమ్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నీతి ఆయోగ్‌ వివిధ మంత్రిత్వశాఖలతో నిరంతరం సంప్రతింపులు జరుపుతోంది.  

మరిన్ని వార్తలు