ఆ బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త.. వారానికి 4 రోజులే పని..!

28 Nov, 2021 17:39 IST|Sakshi

బ్రిటన్ దేశానికి చెందిన ఆటమ్ బ్యాంక్ తమ ఉద్యోగులందరికీ అదిరిపోయే శుభవార్త తెలిపింది. ఆటమ్ బ్యాంక్ తమ ఉద్యోగుల కోసం వారానికి నాలుగు రోజులే పని అనే కాన్సెప్టు అమలుకు శ్రీకారం చుట్టింది. జీతం తగ్గించకుండా వారానికి నాలుగు రోజులే పని అనే కాన్సెప్టు అమలు చేసే అతిపెద్ద సంస్థ బ్రిటన్‌లో మాది మాత్రమే అని ఆటమ్ బ్యాంక్ తెలిపింది. నవంబర్ 1న అమల్లోకి వచ్చిన ఈ విధానాన్ని ఉద్యోగుల శ్రేయస్సు కోసం ప్రవేశపెట్టినట్లు సీఈఓ మార్క్ ముల్లెన్ బీబీసీకి తెలిపారు. ఉద్యోగులు ఇంతకు ముందు ఉన్న 37.5 పని గంటలకు బదులుగా వారానికి 34 గంటలే పనిచేస్తారు అని పేర్కొన్నారు. కంపెనీలోని 430 మంది ఉద్యోగులకు ఈ విధంగా సెలవులు ఇస్తోంది.

దీంతో ఆ బ్యాంకులో పనిచేసే ఉద్యోగులు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వారానికి సోమ, శుక్రవారంతో పాటు మరో రోజును సెలవుగా ఎంచుకునే అవకాశం కల్పించింది. కరోనా వేళ ఉద్యోగులు మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండి సక్రమంగా పని చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ చెబుతోంది. దీనిని ఉపయోగించుకునే ఉద్యోగులు వారు పని రోజుల్లో మరింత ఉత్సాహంగా పనిచేస్తారని కంపెనీ ఆశిస్తుంది. బ్యాంకు ఖాతాదారులు అసౌకర్యానికి గురికాకుండా ఉండటానికి అందరికీ ఒకే రోజు సెలవు ఇవ్వకుండా వారినికి రొటేషనల్ మాదిరి సెలవు ఇస్తున్నట్లు పేర్కొంది. ఎక్కువ రోజులు సెలవులు రావడం ఉద్యోగులు తమ అవసరాలను కూడా తీర్చుకోవచ్చు అని, కుటుంబంతో ఎక్కువ సమయం గడపటంతో మానసిక ఒత్తిడి తగ్గి ఉద్యోగాన్ని కూడా సక్రమంగా చేస్తారని కంపెనీ తెలిపింది. 

(చదవండి: స్టార్టప్‌ రంగంలో భారత్ అగ్రస్థానం: మోదీ)

మరిన్ని వార్తలు