ఏయూ స్మాల్‌ బ్యాంక్‌ లాభం రూ.393 కోట్లు

20 Jan, 2023 04:42 IST|Sakshi

41 శాతం పెరిగిన నికర వడ్డీ ఆదాయం

తగ్గిన ఎన్‌పీఏలు

ముంబై: ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ డిసెంబర్‌ త్రైమాసికానికి ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు 30 శాతం పెరిగి రూ.393 కోట్లుగా నమోదైంది. ఆస్తుల నాణ్యత మెరుగుపడ డం, మొండి బకాయిలకు (ఎన్‌పీఏలు) కేటాయింపులు తగ్గడం లాభాల వృద్ధికి కలిసొచ్చింది. మొ త్తం ఆదాయం 36 శాతం పెరిగి రూ.2,413 కోట్లు గా నమోదైంది. ప్రధానంగా నికర వడ్డీ ఆదాయం 41 శాతం జంప్‌ చేసి రూ.1,153 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్‌ 6.3 శాతంగా నమోదైంది.   

ఆస్తుల నాణ్యత మెరుగు
మొత్తం రుణాల్లో స్థూల ఎన్‌పీఏలు 1.81 శాతంగా (రూ.1,019 కోట్లు) ఉన్నాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఇవి 2.60 శాతం (రూ.1,058 కోట్లుగా) ఉండడం గమనార్హం. నికర ఎన్‌పీఏలు 1.29 శాతం (రూ.520 కోట్లు) నుంచి 0.51 శాతానికి (రూ.285 కోట్లు) పరిమితమయ్యాయి. డిసెంబర్‌ త్రైమాసికంలో రూ.176 కోట్ల కేటాయింపులు చేసింది. రుణ వ్యాపారంలో బలహీన వృద్ధిని చూపించింది. పరిశ్రమ వ్యాప్తంగా రుణాల మంజూరు జోరుగా ఉంటే, ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు డిసెంబర్‌ త్రైమాసికంలో 7 శాతం వృద్ధిని నమోదు చేసింది. మొత్తం రుణాలు రూ.56,335 కోట్లుగా, డిపాజిట్లు 5 శాతం పెరిగి రూ.61,101 కోట్ల చొప్పున ఉన్నాయి. కాసా రేషియో 38 శాతానికి చేరింది. నిధులపై వ్యయాలు 6 శాతంగా ఉన్నాయి. మొత్తం రుణాల్లో 90 శాతం రిటైల్‌ విభాగంలో ఉంటే, 93 శాతం రుణాలు సెక్యూర్డ్‌గా బ్యాంక్‌ తెలిపింది.

మరిన్ని వార్తలు