ఎంట్రీ లెవల్‌లో ఆడి నుంచి మరో సరికొత్త కారు..! ధర ఎంతంటే..!

6 Dec, 2021 18:29 IST|Sakshi

జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి భారత మార్కెట్లలోకి మరో సరికొత్త కారును లాంచ్‌ చేసింది. ఏ4 సెడాన్‌ శ్రేణిలో ఆడి ఏ4 ప్రీమియం ఎంట్రీ లెవల్‌ కారును భారత్‌లోకి ప్రవేశపెట్టింది. ఈ కారు భారత్‌లో రూ. 39.99 లక్షలకు రానుంది(ఎక్స్‌షోరూం).   ఆడి ఏ4 శ్రేణిలో ఇప్పుడు మూడు వేరియంట్లో అందుబాటులో ఉండనుంది.  ప్రీమియం, ప్రీమియం ప్లస్, ఆడి ఏ4  టెక్నాలజీతో రానున్నాయి.  కస్టమర్లకు  ఐదు రకాల బాహ్య రంగులతో,  రెండు రకాల ఇంటీరియర్ రంగులను ఎంచుకోనే వీలును ఆడి కల్పిస్తుంది.

కారు ఫీచర్స్‌..!
ఆడి ఏ4 ప్రీమియమ్ డేటైమ్ రన్నింగ్ లైట్లతో ఎల్‌ఈడీ హెడ్‌లైట్స్‌ను అమర్చారు. ఎల్‌ఈడీ వెనుక కాంబినేషన్ లైట్లు, గ్లాస్ సన్‌రూఫ్, ఆడి సౌండ్ సిస్టమ్, స్మార్ట్‌ఫోన్ ఇంటర్‌ఫేస్, వైర్‌లెస్ ఛార్జింగ్, పార్కింగ్ ఎయిడ్ ,రియర్ వ్యూ కెమెరా వంటి ఫీచర్స్‌ ఉన్నాయి. ఆడి డ్రైవ్ సెలెక్ట్, 25.65 సెం.మీ సెంట్రల్ టచ్ స్క్రీన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌తో రానుంది. భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లను కల్గి ఉంది. దీనిలో క్రూజ్‌ కంట్రోల్‌ను కూడా ఏర్పాటు చేశారు. 

ఇంజిన్‌ విషయానికి వస్తే..!
ఆడి ఏ4 ప్రీమియం కారు రెండు లీటర్ల పెట్రోల్‌ ఇంజిన్‌తో రానుంది. ఈ కారు 190 హెచ్‌పీ శక్తిని, 320 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది. 

అత్యధిక అమ్మకాలు..!
ఆడి ఏ4 ప్రీమియం కారు  విడుదల సందర్భంగా ఆడి ఇండియా హెడ్‌ బల్బీర్‌ సింగ్‌ థిల్లాన్‌ మాట్లాడుతూ.. జనవరిలో ఏ4 విడుదలైనప్పటి నుంచి భారీ ఆదరణ లభిస్తోందని తెలిపారు. తమ సంస్థ నుంచి వస్తున్న కార్లలో ఇదే అత్యధికంగా అమ్ముడవుతోందని పేర్కొన్నారు. తాజాగా విడుదల చేసిన మోడల్‌తో మరింత మంది వినియోగదారులు ఆడి వైపు మొగ్గుచూపుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
చదవండి: కొత్త కారు కొనే వారికి బంపర్ ఆఫర్.. భారీగా తగ్గింపు!

మరిన్ని వార్తలు