ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, 'ఆడీ' కి షాక్‌!

26 Mar, 2022 07:38 IST|Sakshi

కోల్‌కతా: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న ఆడి ఇండియా గతేడాది దేశవ్యాప్తంగా 3,293 యూనిట్లను విక్రయించింది. అంతక్రితం ఏడాదితో పోలిస్తే ఇది 101 శాతం వృద్ధి అని ఆడి ఇండియా హెడ్‌ బల్‌బీర్‌ సింగ్‌ ధిల్లాన్‌ తెలిపారు. 

‘లగ్జరీ కార్ల విపణిలో తొలి స్థానంపై గురి పెట్టడం లేదు. సుస్థిర వ్యాపార విధానం లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. ఇప్పటికే అయిదు ఎలక్ట్రిక్‌ వాహనాలను భారత్‌లో పరిచయం చేశాం. 2025 నాటికి అంతర్జాతీయంగా మొత్తం అమ్మకాల్లో 15 శాతం ఈవీ విభాగం ఉండాలన్నది సంస్థ లక్ష్యం. ప్రస్తుతం నాలుగు ఇంటర్నల్‌ కంబషన్‌ (ఐసీ) కార్ల తయారీని భారత్‌లో చేపడుతున్నాం. 

2033 నాటికి ఐసీ కార్ల విక్రయాలు నిలిపివేస్తాం. 2026 నుంచి నూతన తరం మోడళ్లన్నీ ఎలక్ట్రిక్‌ మాత్రమే ఉంటాయి. ఉక్రెయిన్‌ నుంచి చాలా విడిభాగాలు దిగుమతి చేసుకుంటున్నందున సరఫరా దెబ్బతినే అవకాశం ఉంది’ అని వివరించారు. డీజిల్‌ కార్ల అమ్మకాలను 2020 ఏప్రిల్‌ నుంచి కంపెనీ నిలిపివేసింది. ప్రస్తుతం పెట్రోల్, ఈవీ మోడళ్లు మాత్రమే విక్రయిస్తోంది. లగ్జరీ కార్ల రంగంలో దేశంలో మూడవ స్థానంలో కంపెనీ నిలిచింది.

మరిన్ని వార్తలు