ఎలక్ట్రిక్ కార్లపై సుంకం తగ్గించండి: ఆడి కంపెనీ

26 Sep, 2021 16:26 IST|Sakshi

న్యూఢిల్లీ: జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ "ఆడి" భారతదేశంలో దిగుమతి చేసుకున్న కార్లపై అధిక పన్ను విధించడం అనేది ఎలక్ట్రిక్ కార్ల కొనుగోళ్లను అడ్డుకోవడం అని పేర్కొంది. అలాగే, సుంకాల పరంగా కొంత ఉపశమనం కలిగిస్తే మరిన్ని వాహనాలను విక్రయించడానికి, స్థానిక తయారీ కోసం దేశంలో తిరిగి పెట్టుబడి పెట్టడానికి సహాయపడుతుందని సంస్థ పేర్కొంది. పీటీఐతో ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ మాట్లాడుతూ.. దేశంలోకి దిగుమతి చేసుకున్న మొదటి సెట్ ఎలక్ట్రిక్ వాహనాలను కంపెనీ విక్రయించినట్లు పేర్కొన్నారు.(చదవండి: నిరుద్యోగులకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తీపికబురు!)

"దేశంలోకి తీసుకువచ్చిన మొదటి ఈ-ట్రాన్లు అన్నీ అమ్ముడయ్యాయి. దీన్ని బట్టి మనం అర్ధం చేసుకోవచ్చు. భారత దేశంలో ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి సిద్దంగా ఉన్నారు. అందుకే, భవిష్యత్ లో ఇలాంటి కార్లను మరిన్ని తీసుకొనిరావడానికి మేము సిద్దంగా ఉన్నాము" అని ఆయన పేర్కొన్నాడు. "ఇంపోర్ట్ డ్యూటీ తక్కువగా ఉంటే బహుశా మేము దేశంలో ఎక్కువ ఎలక్ట్రిక్ కార్లను విక్రయించవచ్చు" అని ధిల్లాన్ చెప్పాడు. "దిగుమతి సుంకాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వానికి మా అభ్యర్థన, 3-5 ఏళ్ల వరకు కొంత ఉపశమనం ఇస్తే, స్థానికంగా కార్లను తయారు చేయడానికి దేశంలో మరింత పెట్టుబడి పెట్టడానికి మా ప్రధాన కార్యాలయాన్ని ఒప్పించడానికి మాకు సహాయపడుతుంది" అని అన్నారు.

మరిన్ని వార్తలు