సిబ్బందికి మేనేజ్‌మెంట్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం

11 Mar, 2022 05:18 IST|Sakshi

గీతం వర్సిటీతో అరబిందో ఫార్మా జట్టు

న్యూఢిల్లీ: భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా సిబ్బందిని తీర్చిదిద్దుకోవడంపై ఔషధ రంగ దిగ్గజం అరబిందో ఫార్మా దృష్టి సారించింది. ఇందులో భాగంగా లీడర్‌షిప్, మేనేజ్‌మెంట్‌ నైపుణ్యాలను పెంపొందించుకోవడంతో పాటు మార్కెట్లో ట్రెండ్‌లపై పట్టు సాధించేలా ఉద్యోగుల కోసం శిక్షణా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం గీతం యూనివర్సిటీతో జట్టుకట్టింది. ’ఫోర్‌ పిల్లర్స్‌ ఫర్‌ ఫ్యూచర్‌ రెడీ మేనేజర్స్‌’ పేరిట మేనేజ్‌మెంట్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాంలో 27 మంది ఉద్యోగులకు శిక్షణ కల్పిస్తోంది.

వైజాగ్‌ క్లస్టర్‌లోని మేనేజర్‌ నుంచి డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ స్థాయి వరకూ వివిధ హోదాల్లో ఉన్న సిబ్బంది దీని కోసం ఎంపికయ్యారని అరబిందో ఫార్మా సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (హెచ్‌ఆర్‌) యూఎన్‌బీ రాజు తెలిపారు. నెలకు  రెండు శనివారాలు చొప్పున నాలుగు నెలల పాటు ఈ శిక్షణ ఉంటుందని వివరించారు. భవిష్యత్‌లో కొత్త హోదాలు, బాధ్యతలను నిర్వర్తించేందుకు కావాల్సిన సామర్థ్యాలను సంతరించుకోవడానికి ఉద్యోగులకు ఇది తోడ్పడగలదని రాజు పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు