హైదరాబాద్‌కి వస్తున్న మరో అంతర్జాతీయ సంస్థ

3 Sep, 2021 08:25 IST|Sakshi

ఫార్మా, ఎయిరోస్పేస్‌, ఐటీ, క్లౌడ్‌ స్టోరేజీ రంగాలకు హబ్‌గా మారుతోన్న హైదరాబాద్‌కు మరో అంతర్జాతీయ సంస్థ రానుంది. ఆస్ట్రేలియా టెలికాం దిగ్గజం టెల్ స్ట్రా ఇండియాలో ఇన్నోవేషన్‌ సెంటర్‌ నెలకొల్పేందుకు ముందుకు వచ్చింది. అందుకు వేదికగా హైదరాబాద్‌ను ఎంచుకుంది. 

ఫ్యూచర్‌ టెక్నాలజీపై ఫోకస్‌
టెల్ స్ట్రా సంస్థ హైదరాబాద్‌లో ప్రారంభించబోయే గ్లోబల్‌ క్యాపబులిటీ సెంటర్‌ ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ), 5జీ, ఆర్టిఫీషియల్‌ ఇంటిలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌ వంటి అంశాలపై పని చేస్తుంది. టెలికాం, ఇంటర్నెట్‌ రంగంలో వస్తోన్న నూతన మార్పులను టెక్నాలజిస్టులు పూర్తిగా ఉపయోగించుకోవడంతో పాటు సరికొత్త ఆవిష్కరణలకు ఈ సెంటర్‌ వేదికగా మారనుంది. టెలికాం రంగానికి సంబంధించి స్థానికంగా ఉన్న సాంకేతిక నిపుణులకు మంచి అవకాశాలు రానున్నాయి. 

హైదరాబాద్‌ సెంటర్‌లో
టెల్ స్ట్రా సంస్థ హైదరాబాద్‌లో నెలకొల్పబోయే క్యాంపస్‌ను స్పెషలైజ్డ్‌ హై పెర్ఫార్మెన్స్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరింగ్‌ (హెచ్‌పీఎస్‌ఈ)గా రూపుదిద్దనున్నారు. టెలికాం సాఫ్ట్‌వేర్‌కి సంబంధించి కన్సుమర్‌ బేస్డ్‌ డీప్‌ టెక్నాలజీ ఆవిష్కరణలు ఇక్కడ జరిగే విధంగా హైదరాబాద్‌ క్యాంపస్‌ ఉండబోతుంది. ‘త్వరలో తాము ప్రారంభించే ఇన్నోవేషన్‌ సెంటర్లు టెలికాం రంగంలో కటింగ్‌ ఎడ్జ్‌ టెక్నాలజీకి కేరాఫ్‌ అడ్రస్‌గా ఉంటాయని  టెల్ స్ట్రా ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌టీ అరుణ్‌కుమార్‌ ​తెలిపారు.

భారీగా విస్తరణ
టెలికాం దిగ్గజం టెల్ స్ట్రా సంస్థ తమ వ్యాపార కార్యకలాపాల విస్తరణలో భాగంగా  తొలిసారిగా ఆస్ట్రేలియాకి బయట బెంగళూరులో గ్లోబల్‌ క్యాపబులిటీ సెంటర్‌ని 2019లో ప్రారంభించింది. రెండేళ కిందట రెండు వందల మందితో ప్రారంభమైన బెంగళూరు క్యాంపస్‌లో ప్రస్తుతం ఉద్యోగుల సంఖ్య వెయ్యికి చేరుకుంది. ఇప్పుడు తొలి ఇన్నెవేషన్‌ సెంటర్‌ను మించేలా పుణే, హైదరాబాద్‌లలో మరో రెండు క్యాపబులిటీ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. బెంగళూరు, పూణే, హైదరాబాద్‌లలో కలిపి మొత్తంగా లక్ష చదరపు అడుగుల ఆఫీస్‌ స్పేస్‌లో కంపెనీ కార్యకలాపాలు నిర్వహించాలని టెల్ స్ట్రా లక్క్ష్యంగా పెట్టుకుంది.

చదవండి: అమెజాన్‌ భారీ నియామకాలు

మరిన్ని వార్తలు