టాప్‌ గేర్‌లో వాహన విక్రయాలు!

2 Jul, 2021 06:41 IST|Sakshi

జూన్‌ అమ్మకాల్లో భారీ వృద్ధి

కలిసొచ్చిన లాక్‌డౌన్‌ సడలింపు  

ముంబై: రెండో దశ కరోనా వ్యాప్తితో కుదేలైన వాహన రంగం జూన్‌ మాసంలో కోలుకుంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు కోవిడ్‌ ఆంక్షలను సడలించడంతో ఈ నెలలో వాహన విక్రయాలు గణనీయంగా పుంజుకున్నాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటార్స్, మహీంద్రా అండ్‌ మహీంద్రా, టయోటా, హోండా వంటి ప్రధాన ఆటోమొబైల్‌ కంపెనీల అమ్మకాల్లో వృద్ధిని నమోదు చేశాయి. మారుతీ సుజుకీ జూన్‌లో మొత్తం 1,47,368 యూనిట్లను విక్రయించింది. మే నెలలో కేవలం 46,555 యూనిట్లతో పోలిస్తే 217% పెరిగింది. హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా జూన్‌ 54,474 యూనిట్లు విక్రయించింది. అంతకు ముందు మే నెలలో 30,703 వాహనాలను అమ్మింది.

మే నెలలో 15,181 యూనిట్లు అమ్మిన టాటా మోటర్స్‌.., జూన్‌లో 59% వృద్ధిని సాధించి 24,110 వాహనాలను విక్రయించింది. మహీంద్రా అండ్‌ మహీంద్రా మొత్తం 32,964 వాహనాలను అమ్మగా, ప్యాసింజర్‌ వాహనాలు 16,913 యూనిట్లతో రెట్టింపు వృద్ధి నమోదు చేసింది. కియా మోటార్‌ ఇండియా 36% వృద్ధిని సాధించి మొత్తం 15,015 యూనిట్లను అమ్మింది. మేలో మొత్తం విక్రయాలు 11,050 యూనిట్లుగా ఉన్నాయి. లాక్‌డౌన్‌ సడలింపు కారణంగా యుటిలిటీ వాహన విభాగంలో బలమైన వృద్ధి నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లో కమోడిటీ ధరలు పెరగడం, సెమికండెక్టర్ల కొరతతో ప్యాసింజర్‌ పరిశ్రమలో అనిశ్చితి కొనసాగుతోంది. అయితే డిమాండ్‌ దృష్ట్యా మెరుగైన రికవరీ కనిపిస్తుంది’’ అని టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వాహన విభాగం ప్రెసిడెంట్‌ శైలేజ్‌ చంద్ర తెలిపారు.

మరిన్ని వార్తలు