బాబోయ్‌ పెట్రోల్‌.. భవిష్యత్తు హైపర్‌ ఛార్జర్లదే

9 Jun, 2021 10:02 IST|Sakshi

ఛార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటుపై కంపెనీల ఆసక్తి

స్టేషన్ల ఏర్పాటులో టీవీఎస్‌, హీరో, ఓలా గ్రూపులు

పెట్రోల్‌ షాక్‌తో ప్రత్యామ్నయ ఏర్పాట్లు 

వెబ్‌డెస్క్‌ : పెరుగుతున్న పెట్రోల్‌ ధరలు సామాన్యులకు షాక్‌ ఇస్తున్నాయి. పైకి వెళ్లడమే తప్ప కిందికి రానంట్ను ఫ్యూయల్‌ ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. దీంతో పెట్రోలు పోయించాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంటోంది. మరోవైపు అనేక కంపెనీలు ఎలక్ట్రికల్‌ వెహికల్స్‌ (ఈవీ)కి  అనుగుణంగా ఛార్జింగ్‌ స్టేషన్లను అందుబాబులోకి తెస్తున్నాయి. ఈవీ ఛార్జింగ్‌ పాయింట్లు పెట్రోల్‌ బంకులకు ప్రత్యామ్నయం కానున్నాయా?

ఛార్జింగ్‌ సమస్య
పెట్రోమంటతో ఉక్కిరిబిక్కిరవుతున్న సామాన్యులు పెట్రోల్‌ బండ్లకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ (ఈవీ)కి మారుదామంటే,  వాటి ఛార్జింగ్‌ అంశం సమస్యగా మారింది. ఈవీ వెహికల్స్‌కి ప్రభుత్వం నుంచి పన్ను రాయితీ, ఇతర ప్రోత్సహకాలు లభిస్తున్నా ఛార్జింగ్‌ అనేదే ప్రధాన సమస్యగా మారింది. ఇప్పుడీ సమస్యకు చెక్‌ పెట్టేందుకు ఆటోమొబైల్‌ సంస్థలే స్వయంగా ముందుకు వస్తున్నాయి.

టీవీఎస్‌ ఎంఓయూ
ప్రముఖ ఆటోమొబైల్‌ దిగ్గజం సంస్థ టీవీఎస్‌ కొత్త ఐడియాతో ముందుకు వచ్చింది. ఎంపిక చేసిన నగరాల్లో సొంతంగా ఛార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఒకటైన కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్‌తో అవగాహన ఒప్పందం చేసుకుంది ఈ మేరకు 2020 మార్చి నాటికి దేశంలోని 20 నగరాల్లో ఈవీ వెహికల్స్‌ ఛార్జింగ్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.  టీవీఎస్‌ ఐక్యూబ్‌ ఎలక్ట్రిక్‌ పేరుతో 2020లోనే ఈవీ వెహికల్‌ని టీవీఎస్‌ మార్కెట్‌లోకి తెచ్చింది. అయితే ఛార్జింగ్‌ నెట్‌వర్క్‌ సమస్య కారణంగా కేవలం ఢిల్లీ, బెంగళూరు నగరాలకే పరిమితమైంది.

ఓలా టార్గెట్‌ లక్ష ఛార్జింగ్‌ పాయింట్లు
క్యాబ్‌ సర్వీసులు అందిస్తున్న ఓలా సైతం హైపర్‌ ఛార్జింగ్‌ స్టేషన్లపై దృష్టి పెట్టింది. భారీ ఎత్తున ఓలా స్కూటర్లను ఈ కంపెనీ తయారు చేస్తోంది. దీంతో భవిష్యత్తు అవసరాల దృష్ట్యా రాబోయే రోజుల్లో 400 నగరాల్లో లక్షలకు పైగా హైపర్‌ ఛార్జింగ్‌ నెట్‌వర్క్‌లను అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇళ్లు, పబ్లిక్‌ ప్లేసేస్‌తో పాటు ఇతర ముఖ్యమైన ప్రదేశాల్లో ఈ ఛార్జింగ్‌ పాయింట్లు అందుబాటులో ఉంటాయి. తొలి విడతలో వంద నగరాల్లో ఐదు వేల ఛార్జింగ్‌ పాయింట్లు నిర్మిస్తామని ప్రకటించింది. మరోవైపు ఛార్జింగ్‌ సమస్య పరిష్కారానికి హీరో సంస్థ ఏకంగా రూ. 10,000 కోట్ల రూపాయలను రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌పై ఖర్చు చేస్తోంది. అంతేకాకుండా బ్యాటరీ స్వాపింగ్‌ టెక్నాలజీపై తైవాన్‌కి చెందిన గోగోరో సంస్థతో ఒప్పందం కూడా చేసుకుంది

చదవండి: ఎలక్ట్రిక్‌ వాహనాలకు రాయితీలు

చదవండి:Petrol, diesel prices: పెట్రో బాంబు, రికార్డు ధర

మరిన్ని వార్తలు