యాక్సిస్‌ గూటిలో సిటీ రిటైల్‌

2 Mar, 2023 01:00 IST|Sakshi

దేశీ బిజినెస్‌ కొనుగోలు పూర్తి

రూ. 11,603 కోట్లు చెల్లింపు

న్యూఢిల్లీ/ముంబై: విదేశీ సంస్థ సిటీబ్యాంకు రిటైల్‌ బిజినెస్‌ కొనుగోలు పూర్తయినట్లు ప్రయివేట్‌ రంగ దేశీ దిగ్గజం యాక్సిస్‌ బ్యాంక్‌ తాజాగా పేర్కొంది. దేశీయంగా సంస్థాగత క్లయింట్ల బిజినెస్‌ను మినహాయించిన డీల్‌ ప్రకారం తుదిగా రూ. 11,603 కోట్లు చెల్లించినట్లు వెల్లడించింది. గతేడాది మార్చిలో యాక్సిస్‌ తొలిసారిగా కొనుగోలు అంశాన్ని ప్రకటించింది. దీనిలో భాగంగా 2.4 మిలియన్‌ సిటీ కస్టమర్లను యాక్సిస్‌ పొందింది. డీల్‌ కుదిరే సమయానికి ఈ సంఖ్య 3 మిలియన్లుగా నమోదైనట్లు యాక్సిస్‌ ఎండీ, సీఈవో అమితాబ్‌ చౌధురి తెలియజేశారు.

తమ ఖాతాదారులుగా మారిన సిటీ కస్టమర్ల బ్యాంక్‌ ఖాతాలు, చెక్‌ బుక్కులు, ప్రొడక్టు లబ్ధి తదితరాలు యథావిధిగా కొనసాగనున్నట్లు వివరించారు. మొత్తం 8.6 మిలియన్‌ కార్డులతో నాలుగో పెద్ద క్రెడిట్‌ కార్డుల సంస్థగా నిలుస్తున్న యాక్సిస్‌ మరో 2.5 మిలియన్‌ క్రెడిట్‌ కార్డులను జత చేసుకుంది. తద్వారా మూడో ర్యాంకుకు చేరింది. రూ. 4 లక్షల కోట్ల రిటైల్‌ బుక్‌ కలిగిన యాక్సిస్‌ సిటీబ్యాంక్‌ ఇండియాకు చెందిన 3 మిలియన్‌ కస్టమర్లతోపాటు.. 18 పట్టణాలలోగల 7 కార్యాలయాలు, 21 బ్రాంచీలు, 499 ఏటీఎంలను సొంతం చేసుకుంది. రెండు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందంమేరకు సిటీ బ్రాండును 18 నెలలపాటు యాక్సిస్‌ బ్యాంక్‌ వినియోగించుకోనుంది.

మరిన్ని వార్తలు