యాక్సిస్‌ బ్యాంక్‌ ఉద్యోగులకు వేతన పెంపు

6 Oct, 2020 15:01 IST|Sakshi

ముంబై : కరోనా వైరస్‌తో ఆర్థిక వ్యవస్థ కుదేలైన క్రమంలో ఉద్యోగుల తొలగింపు, వేతన కోతలు అమలవుతుందటే ప్రముఖ ప్రైవేట్‌ బ్యాంక్‌ తమ ఉద్యోగులకు వేతన పెంపును చేపట్టనుంది. అక్టోబర్‌ నుంచి ఉద్యోగుల వేతనాలను 4 నుంచి 12 శాతం వరకూ పెంచేందుకు యాక్సిస్‌ బ్యాంక్‌ నిర్ణయించిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 76,000 మంది ఉద్యోగులు కలిగిన యాక్సిస్‌ బ్యాంక్‌ తన ఉద్యోగులకు బోనస్‌ కూడా చెల్లించింది.మరోవైపు దేశంలో అతిపెద్ద ప్రైవేట్‌ బ్యాంక్‌ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏప్రిల్‌లోనే సామర్థ్యం ఆధారంగా తమ ఉద్యోగుల వేతనాలను పెంచడంతో పాటు బోనస్‌లను చెల్లించిందని బిజినెస్‌ స్టాండర్డ్‌ కథనం పేర్కొంది. చదవండి : ‘లాక్‌డౌన్‌’ కోత జీతాలు త్వరలో చెల్లింపు

ఇక దేశంలో రెండో అతిపెద్ద ప్రైవేట్‌ బ్యాంక్‌ ఐసీఐసీఐ బ్యాంక్‌ తమ లక్ష మంది ఉద్యోగుల్లో 80 శాతం మందికి జులై నుంచి వేతన పెంపును చేపట్టడంతో పాటు బోనస్‌ను చెల్లించింది. ఇక మరో ప్రైవేట్‌ బ్యాంక్‌ కోటక్‌ మహీంద్ర పాతిక లక్షల రూపాయల వార్షిక వేతనం కలిగిన ఎగ్జిక్యూటివ్స్‌కు 10 శాతం వేతన కోత విధించగా, సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ స్ధానాల్లో పనిచేసే వారి వేతనాల్లో 15 శాతం కోత విధించింది. ఇక కరోనా వైరస్‌తో ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోవడంతో భవిష్యత్‌లో తమ వ్యాపారాలు ప్రభావితం కాకుండా యాక్సిస్‌ బ్యాంక్‌, కొటాక్‌ మహింద్ర బ్యాంక్‌, ఐసీఐసీ బ్యాంక్‌లు ఈక్విటీ మార్కెట్ల ద్వారా 900 కోట్ల డాలర్లను సమీకరించాయి.

>
మరిన్ని వార్తలు