బాబా రామ్‌దేవ్‌ కీలక నిర్ణయం..పేరు మార్చేందుకు సిద్ధం..!

12 Apr, 2022 05:56 IST|Sakshi

న్యూఢిల్లీ: యోగా గురువు బాబా రామ్‌దేవ్‌కు చెందిన రుచి సోయా పేరు మారనుంది. పతంజలి ఫుడ్స్‌గా నామకరణం చేసే అవకాశం ఉందని కంపెనీ సోమవారం ప్రకటించింది. అలాగే పతంజలి ఆయుర్వేద పోర్ట్‌ఫోలియోలో ఉన్న ఫుడ్‌ బిజినెస్‌ను సంస్థలో విలీనం చేసే అంశంలో అత్యంత సమర్థవంతమైన విధానాన్ని అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలిపింది. ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ ద్వారా ఇటీవలే రుచి సోయా రూ.4,300 కోట్లు సమీకరించింది. పతంజలి ఆయురేŠవ్‌ద ఫుడ్‌ వ్యాపారాన్ని రుచి సోయాకు కొన్ని నెలల్లో బదిలీ చేయనున్నట్టు గత నెలలో రామ్‌దేవ్‌ ప్రకటించారు.

పతంజలి ఆయుర్వేద ఆహారేతర, సంప్రదాయక ఔషధాలు, వెల్‌నెస్‌ విభాగాల్లో పనిచేస్తుందని వెల్లడించారు. రుచి సోయా కేవలం వంట నూనెలు, ఆహారం, ఎఫ్‌ఎంసీజీ, న్యూట్రాస్యూటికల్స్, ఆయిల్‌ పామ్‌ సాగు విభాగాలపై దృష్టిసారిస్తుందని ప్రకటించారు. ప్రస్తుతం రుచి సోయా 57,000 హెక్టార్లలో ఆయిల్‌ పామ్‌ సాగు చేస్తోంది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాల్లో సాగు విస్తీర్ణం పెద్ద ఎత్తున పెంచాలన్నది ప్రణాళిక. బిస్కెట్స్‌ వ్యాపారాన్ని పతంజలి ఆయుర్వేద గతేడాదే రూ.60 కోట్లకు రుచి సోయాకు బదిలీ చేసింది.

పతంజలి ఆయుర్వేద, రుచి సోయాను వచ్చే అయిదేళ్లలో భారత్‌లో అతిపెద్ద ఫుడ్, ఎఫ్‌ఎంసీజీ సంస్థగా తీర్చిదిద్దాలన్నది లక్ష్యమని రామ్‌దేవ్‌ స్పష్టం చేశారు. హిందుస్తాన్‌ యూనిలీవర్‌ తర్వాత రెండవ అతిపెద్ద ఫుడ్, ఎఫ్‌ఎంసీజీ సంస్థగా పతంజలి ఆయుర్వేద నిలిచిందన్నారు.

చదవండి: గోద్రెజ్‌ ఇండస్ట్రీస్‌ అనూహ్య నిర్ణయం...ఇప్పుడు ఆ రంగంలోకి కూడా ఎంట్రీ..!

మరిన్ని వార్తలు