మరో మూడు నగరాల్లో బజాజ్ చేతక్ బుకింగ్స్ ఓపెన్

21 Jul, 2021 15:30 IST|Sakshi

బజాజ్ ఆటో తన చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను మరిన్ని నగరాల్లోకి వేగంగా తీసుకొనిరావడానికి ప్లాన్ చేసింది. మైసూరు, మంగళూరు, ఔరంగాబాద్ వంటి కొత్త నగరాల్లో చేతక్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ జూలై 22న ప్రారంభిస్తుంది. ఈ నగరాలకు చెందిన ఆసక్తి గల వినియోగదారులు ₹2,000 చెల్లించి ఈ స్కూటర్ బుక్ చేసుకోవచ్చు. గత వారమే నాగ్ పూర్ లో కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్ చేతక్ తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. 2021 ఏప్రిల్ లో బజాజ్ చెన్నై, హైదరాబాద్ నగరాలకు చేతక్ తీసుకొనివస్తున్నట్లు ప్రకటించింది. పూణేకు చెందిన ఆటోమేకర్ వచ్చే ఏడాది నాటికి 22 భారతీయ నగరాల్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ను అందుబాటులో ఉంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. 

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ టీవీఎస్ ఐక్యూబ్, అథర్ 450ఎక్స్ వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోటీ పడుతుంది. ఇది 3.8 కిలోవాట్ మోటార్ ద్వారా పనిచేస్తుంది. దీనిలో 3కేడబ్ల్యుఐపీ 67 లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఈ స్కూటర్ గంటకు 70 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఇందులో స్పోర్ట్ మోడ్, ఎకో మోడ్ అనే రెండు మోడ్స్ ఉన్నాయి. 5 ఆంపియర్ పవర్ సాకెట్ ద్వారా స్కూటర్ ని ఇంటి వద్ద ఛార్జ్ చేయవచ్చు. ఫుల్ ఎల్ఈడీ లైటింగ్, బ్లూటూత్ బేస్డ్ ఇన్ స్ట్రుమెంట్ కన్సోల్, ఇల్యూమినేటెడ్ స్విచ్ గేర్, స్మార్ట్ ఫోన్ యాప్ ఫీచర్స్ ఉన్నాయి. బజాజ్ చేతక్ ఈ-స్కూటర్ అర్బన్, ప్రీమియం అనే రెండు వేరియెంట్లలో లభిస్తుంది. అర్బన్ ధర ₹1.42 లక్షలు కాగా, ప్రీమియం రిటైల్స్ ₹1.44 లక్షలు(ఎక్స్ షోరూమ్, పూణే).

మరిన్ని వార్తలు