బెంగళూరుకు చెందిన ఒక టీ స్టాల్ ఓనర్ ఏకంగా క్రిప్టో కరెన్సీ చెల్లింపులను యాక్సెస్ చేయడం సెన్సేషన్గా మారింది. అది కూడా 'ఫ్రస్ట్రేటెడ్ డ్రాప్ అవుట్' టీ స్టాల్ నిర్వహిస్తూ బిట్కాయిన్ లావాదేవీలు చేయడం విశేషంగా నిలిచింది. ప్రస్తుతం ఇంటర్నెట్లో సంచలనంగా మారిన 22 ఏళ్ల శుభమ్ సైనీ వైరల్ స్టోరీ..
శుభమ్ సైనీ రేవారి, ఇందిరా గాంధీ యూనివర్సిటీ నుంచి బీసీఏ డ్రాప్ అవుట్. ఇంటర్నషిప్ చేద్దామని బెంగళూరు వచ్చాడు. అతనికి స్టాక్ మార్కెట్ అంటే ఆసక్తి ఎక్కువ. ఈ క్రమంలో క్రిప్టో ప్రపంచం అతనికి పరిచయమైంది. రాకేష్ ఝన్ ఝన్వాలా అంతటివాడిని కావాలని కలలు కన్నాడు. అలా 2020లో, మార్కెట్ 60శాతం క్రాష్ అయిన సమయంలో లాభాలను ఆర్జించాలనే ఆశతో క్రిప్టో మార్కెట్లో పెట్టుబడులు పెట్టాడు. రూ. 1.5 లక్షలపై వెయ్యి శాతం లాభాలు గడించాడు. అలా రూ. 30 లక్షల మేర లాభాలు రావడంతో గాల్లో తేలిపోయాడు. 2021 మార్కెట్ పతనంతో ఆ ఆనందం గాల్లోనే కలిసిపోయింది. ఎక్కడ నుంచి మొదలయ్యాడో అక్కడికే చేరాడు. కానీ అక్కడితో కుంగిపోలేదు. ఏమైనా చేయాలనే పట్టుదలతో కేవలం 30వేల పెట్టుబడితో ఆరు నెలల క్రితం టీ దుకాణం ప్రారంభించాడు. మట్టికప్పులో రూ. 20 లకి టీని విక్రయిస్తున్నాడు. ముఖ్యంగా క్రిప్టో లావాదేవీలతో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాడు. 'చాయ్ విత్ క్రిప్టో' దుకాణం చాయ్ లవర్స్ హ్యాంగ్అవుట్గా మారిపోయింది.
ప్రముఖ పెట్టుబడిదారుడు రాకేష్ ఝన్ఝన్వాలా తరువాత నేనే అనుకున్నా. కానీ అనుకున్నట్టుగా జీవితం సాగుదుగా. అనుకోని నష్టాలతో కంగిపోలే.. ఆత్మ విశ్వాసంతో, ఆత్మగౌరవంతో ఎదగాలని భావించాను. అందుకే చిన్నగా టీ స్టాల్ మొదలు పెట్టాను. ముఖ్యంగా పర్యావరణహితంగా మట్టి కప్పులనే వాడుతున్నాను. వారానికి సగటున 20-30 లావాదేవీలు జరుగుతాయనీ, తన పేమెంట్ సిస్టం యూజర్లకు బాగా నచ్చుతోందని శుభమ్ చెప్పారు. యూపీఐ లాంటి నగదు లావాదేవీలతోపాటు కస్టమర్లు క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపులు తన వద్ద చేయవచ్చని తెలిపాడు. దీంతోపాటు నార్త్ ఇండియా వంటకాలతో ‘క్లౌడ్ కిచెన్’ తో మరింత ఆకర్షిస్తున్నాడు. అంతేకాదు అతిపెద్ద గ్రీన్ అండ్ సక్సెస్పుల్ కేఫ్ బ్రాండ్ యజమానిగా ఎదగాలని శుభమ్ సైనీ భావిస్తున్నాడు. దీంతో నెటిజనులంతా ఆల్ ది బెస్ట్ బ్రో అంటు విషెస్ అందిస్తున్నారు.