బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఉద్యోగులకు బంపర్ ఆఫర్!

17 Jun, 2021 20:55 IST|Sakshi

ఎక్కడి నుంచి అయినా పని విధానం 

అధిక ఉత్పాదక రాబట్టుకునే యోచన 

డిజిటల్, మొబైల్‌ బ్యాంకింగ్‌పై ఫోకస్‌ 

భవిష్యత్తు వృద్ధికి బీవోబీ ప్రణాళికలు

న్యూఢిల్లీ: బ్యాంకు ఆఫ్‌ బరోడా (బీవోబీ) తన ఉద్యోగులకు సౌకర్యవంతమైన పనివిధానాన్ని ప్రవేశపెట్టనుంది. తద్వారా ఉద్యోగుల నుంచి మరింత ఉత్పాదకతను రాబట్టే యోచనతో ఉంది. కరోనా రాకతో ఉద్యోగుల పని స్వభావం మార్పు చెందిందని.. ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేసే అనుకూలత ఏర్పడినట్టు బీవోబీ 2020-21 సంవత్సరం వార్షిక నివేదికలో పేర్కొంది. ‘‘ఎక్కడి నుంచి అయినా పనిచేయడం అన్నది నూతన సాధారణ విధానం. ఉద్యోగ బాధ్యతలకు, వ్యక్తిగత జీవితానికి సమాన ప్రాధాన్యం దీంతో సాధ్యపడుతుంది. దీనివల్ల దీర్ఘకాలంలో ఉత్పాదకత పెరుగుతుంది. కొన్ని రకాల విధులను మారుమూల ప్రాంతాల నుంచీ లేదా ఎక్కడ నుంచి అయినా పనిచేసే విధంగా నిర్వహణ నమూనాపై దృష్టి పెట్టాము. ఇది ఉద్యోగులకు ఎంతో వెసులుబాటునిస్తుంది’’ అని బ్యాంకు ఆఫ్‌ బరోడా తెలిపింది. 

డిజిటల్‌ సేవలకు డిమాండ్‌ 
సవాళ్లతో కూడిన ప్రస్తుత సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎన్నో చర్యలను అమలు చేసే విషయంలో బ్యాంకింగ్‌ సేవలు కీలకపాత్ర పోషిస్తున్నట్టు బీవోబీ చైర్మన్‌ హస్‌ముఖ్‌ అదియా చెప్పారు. గతంలో ఎప్పుడు లేని విధంగా డిజిటల్‌ సేవలకు అవసరం ఏర్పడిందని.. కస్టమర్లకు సౌకర్యవంతమైన అనుభవం కోసం బ్యాంకు సేవలను డిజిటల్‌గా మారుస్తున్నట్టు అదియా వివరించారు. బ్యాంకు శాఖల స్థాయిల్లో అధిక శాతం డిపాజిట్లు పేపర్‌ రహితంగానే ఉంటున్నట్టు తెలిపారు. మొబై ల్‌ బ్యాంకింగ్‌ డిజిటల్‌ సేవలకు కీలకంగా పేర్కొన్నారు. రుణాల మంజూరును సైతం డిజిటల్‌గా ఆఫర్‌ చేస్తున్నట్టు చెప్పారు. ఈ విధానాలతో ఖర్చు లు తగ్గించుకుని, మరింత వృద్ధి చెందడానికి అవకా శం ఉంటుందని తెలిపారు. ఆస్తుల నాణ్యత, డిపాజిట్లు, రుణాల వృద్ధి, లాభదాయకత, నిధుల పరం గా బీవోబీ పటిష్ట స్థితిలో ఉన్నట్టు పేర్కొన్నారు.

చదవండి: ఆఫ్రికాలో దొరికిన అరుదైన అతిపెద్ద వజ్రం

మరిన్ని వార్తలు