బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా లాభం రూ.1,679 కోట్లు

30 Oct, 2020 06:20 IST|Sakshi

ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (2020–21, క్యూ2) లో స్టాండెలోన్‌ ప్రాతిపదికన (ఒక్క బ్యాంకింగ్‌ కార్యకలాపాలపైనే) రూ. 1,679 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ. 737 కోట్ల లాభాన్ని నమోదుచేయగా, ఈ ఏడాది తొలి త్రైమాసికం(క్యూ1)లో రూ.864 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. కాగా, కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన (అనుబంధ సంస్థలన్నింటితో కలిపి) బ్యాంకు క్యూ2లో రూ.1,771 కోట్ల నికర లాభాన్ని సాధించింది. నికర వడ్డీ ఆదాయం 6.83 శాతం వృద్ధితో రూ.7,508 కోట్లకు చేరగా, నికర వడ్డీ మార్జిన్‌ 2.96 శాతంగా నమోదైంది.

మొండిబాకీలు తగ్గుముఖం...: బీఓబీ స్థూల మొండిబాకీలు (ఎన్‌పీఏ) ఈ ఏడాది క్యూ2లో 9.14 శాతానికి తగ్గుముఖం పట్టాయి. గతేడాది క్యూ2లో ఇవి 10.25%గా ఉన్నాయి. ఇక నికర ఎన్‌పీఏలు సైతం 3.91 శాతం నుంచి 2.51%కి దిగొచ్చాయి. మొత్తం కేటాయింపులు (ప్రొవిజన్‌లు) జూలై–సెప్టెంబర్‌ క్వార్టర్‌లో రూ.4,209 కోట్ల నుంచి రూ.3,002 కోట్లకు తగ్గాయి. క్యూ2లో తాజాగా మొండిబకాయిలుగా చేరిన రుణాలు రూ.899 కోట్లు. ఇక క్యూ2లో రూ.2,500 కోట్లను బ్యాంక్‌ రికవరీ చేసుకుంది.
 బీఓబీ షేరు బీఎస్‌ఈలో 2 శాతం ఎగబాకి రూ.43 వద్ద స్థిరపడింది.

మరిన్ని వార్తలు