బీవోబీ కనీస రుణ రేటు పెంపు

12 Apr, 2022 06:02 IST|Sakshi

న్యూఢిల్లీ: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీవోబీ) తన కనీస రుణ రేటు ఎంసీఎల్‌ఆర్‌ (మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌)ను అన్ని కాలపరిమితులకు సంబంధించి స్వల్పంగా 5 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒకశాతం) పెంచింది. పెంచిన రేట్లు ఏప్రిల్‌ 12 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. దీని ప్రకారం ఓవర్‌నైట్, నెల, మూడు నెలలు, ఆరు నెలల ఎంసీఎల్‌ఆర్‌లు 0.05 శాతం పెరిగి వరుసగా 6.50 శాతం, 6.95 శాతం, 7.10 శాతం, 7.20 శాతం వరకూ పెరిగాయి.

వ్యక్తిగత, ఆటో, గృహ రుణాలకు ప్రాతిపదిక అయిన ఏడాది ఎంసీఎల్‌ఆర్‌ వడ్డీరేటు 7.35 శాతానికి పెరిగింది. ఈ నెల ప్రారంభంలో జరిగిన ఆర్‌బీఐ పరపతి విధాన కమిటీ కీలక రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 4 శాతం)లో ఎటువంటి మార్పూ చేయకపోయినప్పటికీ, వ్యవస్థలో ఉన్న దాదాపు రూ.8.5 లక్షల కోట్ల అదనపు ద్రవ్యాన్ని కొన్ని సంవత్సరాల్లో క్రమంగా వెనక్కు తీసుకుంటామని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.  

మరిన్ని వార్తలు