కొత్త ఏడాదిలో కస్టమర్లకు షాక్‌.. కీలక నిర్ణయం తీసుకున్న బీఓబీ!

11 Jan, 2023 08:51 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) నిధుల సమీకరణ వ్యయ ఆధారిత (ఎంసీఎల్‌ఆర్‌) రుణ రేటును 35 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒకశాతం) పెంచింది. దీనితో ఎంసీఎల్‌ఆర్‌కు అనుసంధానమైన రుణ రేట్లు మరింత పెరగనున్నాయి. కొత్త రేటు జనవరి 12వ తేదీ నుంచి అమలవుతుంది. బ్యాంక్‌ తాజా నిర్ణయంతో ఓవర్‌నైట్‌ ఎంసీఎల్‌ఆర్‌ 7.50 శాతం నుంచి 7.85 శాతానికి చేరింది.

నెల, మూడు, ఆరు, ఏడాది రేట్లు వరుసగా 8.15 శాతం, 8.25 శాతం, 8.35 శాతం, 8.50 శాతాలకు పెరిగాయి. పలు వాహన, వ్యక్తిగత, గృహ రుణాలకు ఏడాది రుణ రేటు అనుసంధానమై ఉండే సంగతి తెలిసిందే. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌లు సోమవారం రుణ రేటను 25 బేసిస్‌ పాయింట్లు పెంచిన సంగతి తెలిసిందే. 

ఐఓబీ డిపాజిట్ల రేట్లు అప్‌ 
కాగా, చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న  ప్రభుత్వ రంగం ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌  (ఐఓబీ)రిటైల్‌ డిపాజిట్‌ రేటును తక్షణం అమల్లోకి వచ్చే విధంగా 45 బేసిస్‌ పాయింట్లు  పెంచింది. దీని ప్రకారం 444 రోజుల కాలానికి డిపాజిట్లపై 7.75 శాతం రేటు అమలవుతుంది. ఫారిన్‌ కరెన్సీ డిపాజిట్‌ రేటును కూడా మంగళవారం నుంచి బ్యాంక్‌ 1% పెంచింది. దీనితో ఈ రేటు 5 శాతానికి చేరింది.

చదవండి: భళా బామ్మ! సాఫ్ట్‌వేర్‌ను మించిన ఆదాయం, 15 రోజులకే 7 లక్షలు!

మరిన్ని వార్తలు