బ్యాంకుల్లో కుంభకోణాలు,ఏ బ్యాంకులో ఎన్నివేల కోట్ల మోసం జరిగిందంటే!

17 May, 2022 15:03 IST|Sakshi

న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (పీఎస్‌బీ) మోసాల పరిమాణం 51 శాతం తగ్గిందని, రూ.40,295 కోట్లకు దిగి వచ్చిందని రిజర్వ్‌ బ్యాంక్‌ వెల్లడించింది. 2020–21లో 12 పీఎస్‌బీలు రూ. 81,922 కోట్ల మేర మోసాలను రిపోర్ట్‌ చేసినట్లు తెలిపింది.
 

సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ)  కింద  మధ్యప్రదేశ్‌కు చెందిన చంద్రశేఖర్‌ గౌర్‌ చేసిన దరఖాస్తు విషయంలో ఆర్‌బీఐ ఈ మేరకు సమాధానమిచ్చింది. మరోవైపు, పరిమాణం తగ్గినప్పటికీ, సంఖ్యాపరంగా మాత్రం మోసాల ఉదంతాలు ఆ స్థాయిలో తగ్గలేదని పేర్కొంది. 2021 ఆర్థిక సంవత్సరంలో 9,933 ఉదంతాలు చోటు చేసుకోగా 2021–22లో ఈ సంఖ్య కేవలం 7,940కి మాత్రమే తగ్గింది. 

2022 ఆర్థిక సంవత్సరంలో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో అత్యధికంగా రూ.9,528 కోట్ల మేర మోసాలకు సంబంధించి 431 ఉదంతాలు నమోదయ్యాయి. ప్రభుత్వ రంగ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో రూ.6,932 కోట్లు (4,192 కేసులు), బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో రూ.3,989 కోట్లు (280 కేసులు), యూనియన్‌ బ్యాంక్‌లో రూ.3,939 కోట్ల (627 కేసులు) మేర మోసాలు నమోదయ్యాయి. బ్యాంకులు  పంపే నివేదికలను బట్టి డేటాలో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరగవచ్చని ఆర్‌బీఐ తెలిపింది.

చదవండి👉బ్యాంకులంటే విజయ్‌ మాల్యాకు గుండెల‍్లో దడే! కావాలంటే మీరే చూడండి!

>
మరిన్ని వార్తలు