కొత్తగా బ్యాంక్ లోన్ తీసుకునే వారికి గుడ్ న్యూస్

21 Apr, 2021 20:46 IST|Sakshi

మీరు ఇప్పటివరకు ఎప్పుడు కూడా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోలేదా?. కొత్తగా మీకు రుణాలు ఇవ్వాలంటే సిబిల్ స్కోర్ లేని కారణంగా ఆలోచిస్తున్నాయా?. అయితే మీకు శుభవార్త. సాధారణంగా బ్యాంకులు సీబీల్ స్కోర్ ఆధారంగా వినియోగదారులకు రుణాలు మంజూరు చేస్తూ ఉంటాయి. అయితే మొదటిసారిగా లేదా కొత్తగా ఎవరైనా బ్యాంకు నుంచి రుణం పొందాలంటే వారికి ఎలాంటి క్రెడిట్ స్కోర్ ఉండకపోవడంతో బ్యాంకులు కాస్త వెనకడుగు వేస్తుంటాయి. ఇలాంటి సమస్యల పరిష్కారానికి ట్రాన్స్‌యూనియన్‌ సిబిల్‌ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.

ఎలాంటి క్రెడిట్ స్కోరు, లోన్ హిస్టరీ లేని వారికి గురించి అంచనా వేసేందుకు వీలుగా క్రెడిట్‌ విజన్‌ న్యూ టు క్రెడిట్‌(ఎన్‌టీసీ) స్కోరు అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు ట్రాన్స్‌యూనియన్‌ సిబిల్‌ వెల్లడించింది.ఈ ఎన్‌టీసీతో వినియోగదారులకు లోన్ ఇవ్వొచ్చా? లేదా అని నిర్ణయించడం బ్యాంకులకు, ఇతర రుణ సంస్థలకు సులభతరం కానుంది. ఈ కొత్త స్కోర్ ను రుణ గ్రహీత గురించి అందుబాటులో ఉన్న వివిధ సమాచారం ఆధారంగా నిర్ణయించనున్నారు.

క్రొత్త అసెస్‌మెంట్ లేదా స్కోరింగ్ మోడల్‌ను క్రెడిట్ విజన్ అని పిలుస్తారు. క్రెడిట్‌ విజన్‌ స్కోర్ 101-200 వరకు ఉంటుంది. స్కోర్ ఎంత ఎక్కువ ఉంటే రుణం ఇవ్వడానికి అంత ఎక్కువ అవకాశం ఉంటుంది. స్కోర్ తక్కువగా ఉంటే సదరు వ్యక్తి లోన్ తిరిగి చెల్లించకపోవడానికి అవకాశం ఉంటుందని బ్యాంకులు భావిస్తాయి. ఈ స్కోర్ కొత్తగా లోన్ తీసుకునే వారికి కీలకంగా మారనుంది. క్రెడిట్ సంస్థలు, బ్యాంకుల ద్వారా మాత్రమే ఈ మోడల్ అందుబాటులో ఉంటుంది.

చదవండి: Flipkart: ఆర్డర్ చేసిన గంటన్నరలో ప్రొడక్ట్ డెలివరీ

మరిన్ని వార్తలు