తక్కువ మార్జిన్లతో బ్యాంకింగ్ పనిచేయాలి
ప్రస్తుత ఎకానమీకి ఇది అవసరం
ఎస్బీఐ డిప్యూటీ ఎండీ రాధాకృష్ణన్ సూచన
కోల్కతా: భారత్ బ్యాంకింగ్ తక్కువ నికర మార్జిన్లతో (ఎన్ఐఎం) పనిచేయాల్సిన అవసరం ఉందని బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ వీఎస్ రాధాకృష్ణన్ సూచించారు. ఎంసీసీఐ నిర్వహించిన ఒక వెబినార్లో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం బ్యాంకింగ్ నికర మార్జిన్లు 3 నుంచి 3.5 శాతం శ్రేణిలో ఉన్నాయని, దీనికన్నా తక్కువ మార్జిన్లతో పనిచేయగల సామర్థాన్ని బ్యాంకులు పెంపొందించుకోవాలని సూచించారు.
అధిక మార్జిన్లు బ్యాంకింగ్కు మంచిదేఅయినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఎకానమీ పురోగతికి తక్కువ మార్జిన్ల వ్యవస్థ చాలా అవసరమని అన్నారు. ఇందుకు తగిన వ్యవస్థ రూపకల్పన జరగాలనీ సూచించారు. అధిక మార్జిన్ల వల్ల రుణ రేట్ల భారం పెరుగుతోందన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...
మార్చి 2020 తర్వాత 115 బేసిస్ పాయింట్లు రెపోను తగ్గించిన ఆర్బీఐ, కరోనా కష్ట కాలం దేశానికి ప్రారంభమైన తర్వాత యథాతథ రేటును కొనసాగిస్తూ వస్తోంది. కేంద్రం నిర్దేశాలకు (2 నుంచి 6 శాతం మధ్య) అనుగుణంగా 2021–22లో రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 5.1 శాతంగా కొనసాగుతుందని అంచనావేసింది. రెపో రేటుకు ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం మొదటి, రెండవ, మూడవ, నాల్గవ త్రైమాసికాల్లో వరుసగా 5.2 శాతం, 5.4 శాతం, 4.7 శాతం, 5.3 శాతంగా కొనసాగుతాయన్నది ఆర్బీఐ అంచనా.
ఎన్బీఎఫ్సీలపై ఎన్పీఏల ఒత్తిడి: ఇక్రా
నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలపై (ఎన్బీఎఫ్సీ) రుణ ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉందని దేశీయ రేటింగ్ ఏజెన్సీ– ఇక్రా అంచనావేస్తోంది. ఒత్తిడిలో ఉన్న రుణ నాణ్యత మరింత క్షీణించే అవకాశం ఉందని విశ్లేషించింది. ఇక్రా నివేదిక ప్రకారం, ఎన్బీఎఫ్సీలు మంజూరుచేసిన రుణాల్లో 30 శాతం ఇబ్బందికరమైన విభాగాల్లో ఉన్నాయి. రియల్టీ, వ్యక్తిగత రుణాలు, సూక్ష్మ రుణాలు, చిన్న మధ్య తరహా పరిశ్రమలు, వాణిజ్య, పాసింజర్ వాహన విభాగాలకు రుణాలు వీటిలో ఉన్నాయి. రంగాలవారీగా చూస్తే, 40 శాతం ఎన్బీఎఫ్సీల రుణాలు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు వంటి పెద్ద రాష్టాల్లో మంజూరయ్యాయి.
ఇవన్నీ కరోనా సెకండ్ వేవ్లో తీవ్రంగా దెబ్బతిన్న రాష్ట్రాలు కావడం గమనార్హం. ఎన్బీఎఫ్సీలకు ఇప్పటికే పెరిగిన నిరర్ధక ఆస్తుల నిష్పత్తి 2021–22 ఆర్థిక సంవత్సరంలో మరో ఒక శాతం వరకు పెరుగుతుందని అంచనా. కోవిడ్–19 సెకండ్వేవ్ దీనికి ప్రధాన కారణం. ఇంతక్రితం ఎన్బీఎఫ్సీల రుణ వృద్ధి 8 నుంచి 10 శాతం ఉంటుందని ఇంతక్రితం వేసిన అంచనాలను తాజాగా 7 నుంచి 9 శాతం శ్రేణికి కుదిస్తున్నాం. అయితే ఈ శ్రేణికూడా 2020–21 ఆర్థిక సంవత్సరంలో జరిగిన 4 శాతం రుణ వృద్ధి కన్నా అధికం కావడం గమనార్హం.
సెకండ్వేవ్ వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రుణ పంపిణీలు అనుకున్నమేరకు జరక్కపోవడం దీనికి కారణం. మార్చితో ముగిసిన త్రైమాసికంతో పోల్చితే రుణ పంపిణీలు ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో 50 నుంచి 60 శాతం మేర పడిపోయే అవకాశం ఉంది. ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికం నుంచీ పరిస్థితి మెరుగుపడవచ్చు. అయితే మూడవ వేవ్ హెచ్చరికలు పొంచిఉన్న విషయాన్ని ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. పెరుగుతున్న అవసరాలకోసం ఎన్బీఎఫ్సీలకు రూ.2 లక్షల కోట్ల నిధులు అవసరం.
చదవండి: ఇక చిన్న సంస్థలకూ రేటింగ్స్