ఆరేళ్లలో రూ.15 లక్షల కోట్ల ముద్రా యోజన రుణాలు

27 May, 2021 14:44 IST|Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ముద్రా యోజన పథకం కింద గణనీయమైన స్థాయిలో రుణ వితరణ నమోదైంది. ఆరేళ్లలో 28 కోట్ల మందికి పైగా లబ్దిదారులకు రూ.15 లక్షల కోట్ల రుణాలను బ్యాంకులు మంజూరు చేసినట్టు కేంద్ర ఆర్థిక శాఖా ప్రకటించింది. ప్రధానమంత్రి ముద్రా యోజన (పీఎంఎంవై) పథకాన్ని 2015 ఏప్రిల్‌ 8న ప్రధాని మోదీ ప్రారంభించడం గమనార్హం. ఈ పథకం కింద ఎటువంటి తనఖా లేకుండానే రూ.10 లక్షల వరకు రుణ సాయాన్ని పొందేందుకు అవకాశం ఉంది. 

శిశు, కిశోర్, తరుణ్‌ అనే మూడు విభాగాలు కింద.. తయారీ, ట్రేడింగ్, సేవల రంగం, వ్యవసాయం రంగ సంబంధిత పరిశ్రమలకు ఈ పథకం కింద రుణ వితరణ చేయాలన్నది లక్ష్యం. శిశు విభాగం కింద రుణ గ్రహీతలకు 2 శాతం వడ్డీ రాయితీని ఆత్మనిర్భర్‌ భారత్‌ ప్యాకేజీలో భాగంగా గతేడాది కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనా కారణంగా లాక్‌డౌన్‌ల వల్ల ఎదురైన సమస్యల నుంచి చిన్న పరిశ్రమలు గట్టెక్కేందుకు ఈ సాయాన్ని ప్రకటించింది. శిశు విభాగం కింద తనఖా లేకుండా ఒక్కో పరిశ్రమకు రూ.50,000 వరకు రుణం మంజూరవుతుంది. 2020 మార్చి నాటికే శిశు విభాగం కింద 9.37 కోట్ల రుణ ఖాతాలున్నాయి. 

చదవండి:

ఉద్యోగుల భద్రత కోసం తగ్గేది లేదు: ఎల్‌అండ్‌టీ

మరిన్ని వార్తలు