పన్ను పోటు: భవిష్యత్తులో పసిడి ధర ఎంత పెరగనుంది?

2 Jul, 2022 16:10 IST|Sakshi

సాక్షి, ముంబై: కేంద్ర ప్రభుత్వం బంగారంపై ప్రాథమిక దిగుమతి సుంకాన్ని 5 శాతం పెంచడంతో బంగారం ధరలు పెరగడం ఖాయమని మార్కెట్‌ వర్గాలు తేల్చి చెబుతున్నారు. ఇటీవలి కాలంలో బంగారం దిగుమతులు పెరగడం, పసిడి అక్రమ రవాణా నిరోధించే లక్ష్యం,  అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి రికార్డు కనిష్టాలకు పడిపోతుండటం, కరెంట్‌ ఖాతాపై ఒత్తిడి లాంటి అంశాల నేపథ్యంలో ఆర్థికశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.  దీంతో బంగారం ధరలు కనీసం ఐదు శాతం పెరుగుతుందని అంచనాలు  నెలకొన్నాయి.

భారతదేశంలో బంగారంపై విధించే మొత్తం దిగుమతి సుంకం మూడు భాగాలను ఉంటుంది. బేస్ డ్యూటీ, వ్యవసాయ సెస్, సోషల్‌ సర్వీస్‌ సర్‌ఛార్జ్. వ్యవసాయ సెస్ 2.5 శాతం ఉండగా, సర్‌చార్జ్‌  రద్దయింది. అయితే దిగుమతి సుంకం పెంపుపై  ఐబీజేఏ సురేంద్ర  స్పందించారు. ఆయన అంచనా ప్రకారం భవిష్యత్తులో పసిడి 10 గ్రాములకు రూ. 2500 మేర పెరగనుంది. డాలర్‌తో రూపాయి పడి పోతున్న తీరు, బంగారం  దిగుమతుల నేపథ్యంలో తాజా పెంపును ఊహించినప్పటికీ ప్రభుత్వం ఇంత త్వరగా ప్రకటిస్తుందని ఊహించ లేదన్నారు.

మరోవైపు కేంద్రం బంగారంపై దిగుమతి సుంకాన్ని 10.75 శాతం నుంచి 15 శాతానికి పెంచిన మరుసటి రోజే  పసిడి ప్రియులకు  తీవ్ర నిరాశ ఎదురైంది.  ఊహించినట్టుగానే దేశవ్యాప్తంగా శనివారం ఉదయం బంగారం ధరలు  పుంజుకున్నాయి.   

మరిన్ని వార్తలు