‘4జీ నుంచి 5జీకి ఇలా అప్‌గ్రేడ్‌ అవ్వండి’ అంటూ..ట్రెండ్‌ ఫాలో అవుతున్న సైబర్‌ కేటుగాళ్లు

9 Oct, 2022 07:40 IST|Sakshi

సైబర్‌ నేరస్తులు ట్రెండ్‌ ఫాలో అవుతున్నారు. మార్కెట్‌ బూమ్‌ను బట్టి జేబులు నింపుకుంటున్నారు. కోవిడ్‌ వ్యాక్సిన్‌, ఆధార్‌ కార్డు, బ్యాంకు సర్వీసులు, యూపీఐ పేమెంట్స్‌ ఇలా సందర్భాన్ని టెక‍్నాలజీని అడ్డు పెట్టుకొని ప్రజల జేబులు గుల్ల చేస్తున్నారు.

తాజాగా మన దేశంలో అందుబాటులోకి వచ్చిన ఫాస్టెస్ట్‌ 5జీ నెట్‌ వర్క్‌ సైబర్‌ నేరగాళ్లకు కాసులు కురిపిస‍్తోంది. 4జీ నుంచి 5జీ అప్‌గ్రేడ్‌ పేరుతో కేటగాళ్లు బురిడీ కొట్టిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్‌ను 5జీకి అప్‌గ్రేడ్‌ చేసుకోవాలంటూ పలువురికి ఫోన్లు చేస్తూ.. ఓటీపీ చెప్పాలని కోరుతున్నారు. యూపీఐ, బ్యాంకు యాప్‌లకు అనుసంధానం అయిన మొబైల్‌ నంబర్ల ద్వారా ఖాతాల్లోకి చొరబడే ప్రయత్నం చేస్తున్నారు.

అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టెక్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు.  4జీ నుంచి 5జీకి అప్ గ్రేడ్‌ అవ్వండంటూ వచ్చే ఏ మెసేజ్‌ను నమ్మొద్దు చెబుతున్నారు. ఆ తరహా మెసేజ్‌ లింకులు క్లిక్‌ చేయొద్దు. ఫోన్‌ను అప్‌గ్రేడ్‌ చేసుకోవాలనుకుంటే సంబంధిత టెలికం సంస్థ కార్యాలయంలో 5జీ అప్‌గ్రేడేషన్‌ చేసుకోవాలని, ఫేక్‌ లింకులను క్లిక్‌ చేసి ఆర్థిక మోసాలకు, డేటా చౌర్యానికి గురికావద్దని అంటున్నారు.  5జీ పేరుతో ఫేక్‌ లింకులు వస్తున్నాయని, అనుమానం ఉంటే తక్షణమే స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని పోలీసులు సైతం సామాన్యుల్లో చైతన్యం కల్పిస్తున్నారు. 

మరిన్ని వార్తలు