అపర కుబేరుడి పెద్ద మనసు.. భారీగా సొమ్ము దానం!

7 Dec, 2021 20:17 IST|Sakshi

ప్రపంచ కుబేరుల జాబితాలో రెండవ స్థానంలో ఉన్న జెఫ్‌ బెజోస్‌ పర్యావరణ పరిరక్షణ విషయంలో తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడే సంస్థలకు అమెజాన్ వ్యవస్థాపకుడు సోమవారం 443 మిలియన్ డాలర్ల విరాళాన్ని ప్రకటించారు. ప్రపంచ కుబేరుడు జెఫ్​ బెజోస్ పర్యావరణ పరిరక్షణ కోసం కోసం రూ.75 వేల కోట్ల (10 బిలియన్ డాలర్లు) నిధులను ఖర్చు చేయనున్నట్టు గతంలో వెల్లడించారు.

క్లైమేట్ చేంజ్​పై పోరాటం కోసం ‘బెజోస్ ఎర్త్ ఫండ్’ కింద ఈ నిధులను ఖర్చు చేస్తామని తెలిపారు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు సైంటిస్టులు, యాక్టివిస్టులు, ఎన్జీవోలు చేసే ఎలాంటి ప్రయత్నానికైనా తాము బెజోస్ ఎర్త్ ఫండ్ కింద ఆర్థిక సాయం అందచేస్తామన్నారు. ఇప్పుడు ఆ నిధులలో నుంచి బెజోస్‌ 443 మిలియన్ డాలర్ల విరాళాన్ని ప్రకటించారు. వాతావరణ కాలుష్యాన్ని అరికట్టడం కోసం పనిచేస్తున్న 19 విభిన్న సంస్థలకు $130 మిలియన్లను ఇచ్చారు. అలాగే, సెప్టెంబర్ నెలలో వాతావరణ న్యాయ సమూహాలకు మరో $150 మిలియన్లను ఇచ్చినట్లు బెజోస్ ఎర్త్ ఫండ్ అధ్యక్షుడు, సీఈఓ ఆండ్రూ స్టీర్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ గ్రాంట్లలో 130 మిలియన్ డాలర్లను అమెరికాలో జస్టిస్ 40 చొరవను ముందుకు తీసుకువెళ్ళడానికి, 30ఎక్స్30 చొరవ కింద 2030 నాటికి 30 శాతం భూమి & సముద్రాన్ని రక్షించడానికి 261 మిలియన్ డాలర్లను ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇంకా అమెరికా & ఆఫ్రికాలో భూ పునరుద్ధరణకు కోసం 51 మిలియన్ డాలర్లు ఇచ్చినట్లు ఒక ప్రకటనలో సంస్థ తెలిపింది. 

మరిన్ని వార్తలు