PUBG: అందరికీ అందుబాటులో బీజీఎమ్ఐ

3 Jul, 2021 07:26 IST|Sakshi

న్యూఢిల్లీ: దక్షిణ కొరియా గేమింగ్‌ సంస్థ క్రాఫ్టన్‌ తాజాగా బ్యాటిల్‌గ్రౌండ్స్‌ మొబైల్‌ ఇండియా గేమ్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇది ప్రత్యేకంగా దేశీ గేమింగ్‌ ప్రియుల కోసం తయారు చేసిందని పేర్కొంది. ఈ ఏడాది మే 18న ప్రీ–రిజిస్ట్రేషన్స్‌ ప్రారంభించగా ఏకంగా 4 కోట్ల పైచిలుకు రిజిస్ట్రేషన్స్‌ వచ్చాయని తెలిపింది. జూన్‌ 17న గేమింగ్‌ ప్రియులకు ముందస్తుగా అందుబాటులోకి తెచ్చామని, సుమారు 2 కోట్ల మంది ప్లేయర్లు దీన్ని ఆడి, అభిప్రాయాలు తెలిపారని క్రాఫ్టన్‌ వివరించింది.

ప్రస్తుతం ఇది గూగుల్‌ ప్లే స్టోర్‌లో ఫ్రీ–టు–ప్లే మల్టీప్లేయర్‌ గేమ్‌గా అందుబా టులో ఉంటుందని పేర్కొంది. క్రాఫ్టన్‌ అనుబం ధ సంస్థ పబ్‌జీ కార్పొరేషన్‌కి చెందిన పబ్‌జీ గేమ్‌ను, చైనాతో సరిహద్దు వివాదం నేపథ్యంలో భద్రతా కారణాల రీత్యా కేంద్రం గతేడాది నిషేధించింది. చైనాకు చెందిన టెన్సెంట్‌ గేమ్స్‌ సంస్థ పబ్‌జీని భారత్‌లో పంపిణీ చేసేది. ఆ తర్వాత ఆ కంపెనీకి భారత్‌లో పంపిణీ హక్కులను ఉపసంహరించినట్లు పబ్‌జీ కార్పొరేషన్‌ అప్పట్లో తెలిపింది.

తాజాగా దాని స్థానంలో క్రాఫ్టన్‌ కొత్త గేమ్‌ను ఆవిష్కరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్‌లో 100 మిలియన్‌ డాలర్లు ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు క్రాఫ్టన్‌ తెలిపింది. ఇప్పటికే పలు సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకునే ప్రక్రియలో ఉన్నట్లు వివరించింది.

మరిన్ని వార్తలు