వ్యాక్సిన్‌ బాటలో భారత్‌ బయో- బయెలాజికల్‌-ఇ

14 Aug, 2020 10:31 IST|Sakshi

కోవిడ్‌- 19కు చెక్‌ పెట్టేందుకు..

తొలి దశ క్లినికల్‌ పరీక్షలలో ప్రాథమిక ఫలితాలు గుడ్‌

తాజాగా వెల్లడించిన భారత్‌ బయోటెక్‌ 

యూఎస్‌ కంపెనీ జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌తో జత

వ్యాక్సిన్ తయారీకి ఒప్పందం -బయొలాజికల్‌-ఇ

న్యూఢిల్లీ: ఐసీఎంఆర్‌తో కలసి భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేస్తున్న కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ తొలి దశ ప్రాథమిక పరీక్షలలో సత్ఫలితాలు వచ్చినట్లు ఎయిమ్స్‌ ఢిల్లీ ప్రిన్సిపల్‌ సంజయ్‌ రాయ్‌ వెల్లడించారు. కోవాగ్జిన్‌ పేరుతో రూపొందిస్తున్న వ్యాక్సిన్‌ తొలి దశ క్లినికల్‌ పరీక్షలలో 12 ప్రాంతాలలో 375 మందిపై పరిశీలించినట్లు రోహ్‌తక్‌లోని పీజీఐలో పరీక్షలు నిర్వహిస్తున్న సవితా వర్మ పేర్కొన్నారు. తొలి దశలో ఎలాంటి సమస్యలూ ఎదురుకాలేదని తెలియజేశారు. దీంతో రెండోసారి వ్యాక్సిన్‌ ఇవ్వడం ద్వారా రోగనిరోధక శక్తి ఎలా ప్రభావితమవుతున్నదీ గమనించనున్నట్లు వెల్లడించారు. ఇందుకు వీలుగా ప్రస్తుతం రెండో డోసేజీ ఇవ్వడం ద్వారా రక్త నమూనాలను సేకరిస్తున్నట్లు సంజయ్‌ రాయ్‌ వెల్లడించారు. ఈ పరీక్షలు కూడా విజయవంతమైతే.. తదుపరి రెండో దశ క్లినికల్‌ పరీక్షలకు అనుమతించవలసిందిగా డీసీజీఏను అభ్యర్థించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెలాఖరుకల్లా తొలి దశ పరీక్షలు పూర్తికానున్నట్లు భావిస్తున్నారు.

బయొలాజికల్‌-ఇ
హైదరాబాద్‌: యూఎస్‌‌ దిగ్గజం జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌తో కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ అభివృద్ధి, తయారీకి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు హైదరాబాద్‌ కంపెనీ బయొలాజికల్‌-ఇ వెల్లడించింది. తద్వారా భారీ స్థాయిలో వ్యాక్సిన్‌ ఉత్పత్తిని చేపట్టనున్నట్లు తెలియజేసింది. ఇదేవిధంగా బేలర్‌ కాలేజ్‌ ఆఫ్‌ మెడిసిన్‌తో లైసెన్సింగ్‌ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు కంపెనీ ఎండీ దాట్ల మహిమ పేర్కొన్నారు. తద్వారా చౌక ధరల్లో కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ను అందించే ప్రణాళికల్లో ఉన్నట్లు వివరించారు.

మరిన్ని వార్తలు