భారత్‌ బయోటెక్‌ ఒప్పందం రద్దు.. ఆ వెంటనే బ్రెజిల్‌ కూడా..

24 Jul, 2021 13:31 IST|Sakshi

అవినీతి ఆరోపణలు, రాజకీయ విమర్శల కారణంగా.. భారత్‌ బయోటెక్‌ కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. బ్రెజిల్‌తో కుదుర్చుకున్న కోవిడ్‌ వ్యాక్సిన్‌ ఒప‍్పందాన్ని రద్దు చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది. బ్రెజిల్‌లో ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో కరోనా కారణంగా 2లక్షల మందికి పైగా మరణించడంతో అధ్యక్షుడిపై విమర్శలొచ్చాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ త్వరగతిన సరఫరా కోసం బ్రెజిల్ అధ్యక్షుడు జైరో బొల్సొనారో మనదేశానికి చెందిన భారత్‌ బయోటెక్‌తో ఒప్పందం కుదర్చుకున్నారు. భారత్‌ బయోటెక్‌కు చెందిన కోవాగ్జిన్‌ను బ్రెజిల్‌ మార్కెట్‌లో విడుదల చేసేందుకు బొల్సొనారో మధ్యవర్తిగా ప్రముఖ ఫార్మసంస్థ ప్రెసిస మెడికామెంటోస్,ఎన్విక్సియా ఫార్మాసూటికల్స్‌ అనుమతించారు.

ఈ క్రమంలో... ఒక్కోడోసు 15 డాలర్ల చొప్పున  300 మిలియన్‌ డాలర్లు విలువ చేసే 20 మిలియన్‌ డోసులను తెప్పించుకునేందుకు బొల్సొనారో సర్కార్‌  ఒప్పందం చేసుకుంది..  అయితే ఈ వ్యాక్సిన్‌ ఒప్పందంలో  బొల్సొనారోపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి.  కోవాగ్జిన్‌ను తన సన్నిహితులకు చెందిన ఫార్మా సంస్థ ప్రెసిసా మెడికామెంటోస్‌కు అప్పగించడం ద్వారా ఏకంగా 10 కోట్ల డాలర్లు (రూ. 734 కోట్లు) ముడుపులు అందుకున్నారని ఆయనపై విమర్శలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు కూడా విచారణకు ఆదేశించింది.

ఈ నేపథ్యంలో టీకా అనుమతుల్ని రద్దు చేసుకుంటున్నట్లు భారత్‌ బయోటెక్‌ ప్రకటించింది. ఆ వెంటనే.. బ్రెజిల్‌ సైతం తమ దేశంలో కోవాగ్జిన్‌ క్లినికల్‌ ట్రయిల్స్‌ మూడోదశ నిర్వహించడాన్ని రద్దు చేసుకున్నట్లు ప్రకటించింది. అయితే  ఒప్పందం రద్దైనప్పటికీ .. కోవాగ్జిన్‌ను సరఫరా చేయడానికి అవసరమైన అనుమతులు పొందడానికి బ్రెజిల్‌ ఆరోగ్య నియంత్రణ సంస్థ అనివిసాతో భారత్‌ బయోటెక్‌ కలిసి పని చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు