భారత్‌ ఫోర్జ్‌ లాభం అప్‌

17 May, 2022 06:24 IST|Sakshi

క్యూ4లో రూ. 232 కోట్లు

షేరుకి రూ. 5.5 డివిడెండ్‌

న్యూఢిల్లీ: ఆటో విడిభాగాల దిగ్గజం భారత్‌ ఫోర్జ్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 9 శాతం పుంజుకుని రూ. 232 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో రూ. 212 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 2,083 కోట్ల నుంచి రూ. 3,573 కోట్లకు ఎగసింది. మొత్తం వ్యయాలు రూ. 1,841 కోట్ల నుంచి రూ. 3,296 కోట్లకు పెరిగాయి. వాటాదారులకు షేరుకి రూ. 5.50 చొప్పున తుది డివిడెండు ప్రకటించింది.
 
కొత్త ఆర్డర్లు ప్లస్‌: మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి భారత్‌ ఫోర్జ్‌ టర్న్‌అరౌండ్‌ ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ. 1,077 కోట్ల నికర లాభం సాధించింది. 2020–21లో రూ. 127 కోట్ల నికర నష్టం నమోదైంది. ఇక మొత్తం ఆదాయం సైతం రూ. 6,336 కోట్ల నుంచి రూ. 10,461 కోట్లకు జంప్‌ చేసింది. దేశీ కార్యకలాపాల నుంచి రూ. 1,000 కోట్ల విలువైన కొత్త ఆర్డర్లను సాధించినట్లు కంపెనీ చైర్మన్, ఎండీ బీఎన్‌ కళ్యాణి వెల్లడించారు.  ఆటోమోటివ్, ఇండస్ట్రియల్‌ అప్లికేషన్స్‌ నుంచి ఇవి లభించినట్లు పేర్కొన్నారు. ఈ బాటలో ఉత్తర అమెరికా నుంచి స్టీల్, అల్యూమినియం ఫోర్జింగ్‌ కార్యకలాపాల ద్వారా 15 కోట్ల డాలర్ల విలువైన తాజా కాంట్రాక్టులను పొందినట్లు తెలియజేశారు.  
ఫలితాల నేపథ్యంలో భారత్‌ ఫోర్జ్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 5.5% జంప్‌చేసి రూ. 663 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు