10 కోట్లు దాటిన భారత్‌పే యూపీఐ లావాదేవీలు

13 Apr, 2021 14:43 IST|Sakshi

న్యూఢిల్లీ: ఫిన్‌టెక్‌ కంపెనీ భారత్ ‌పే ఈ ఏడాది మార్చి నెలలో 10.6 కోట్ల యూపీఐ (830 మిలియన్‌ డాలర్ల విలువ) లావాదేవీలను సాధించింది. 2021-22లో యూపీఐ విభాగంలో మూడు రెట్ల వృద్ధిని లక్షించినట్లు కంపెనీ తెలిపింది. ఫిన్‌టెక్‌ పరిశ్రమలో భారత్‌పే 8.8 శాతం మార్కెట్‌ వాటాను కలిగింది. గత ఏడాది కాలంగా భారత్‌పే యూపీఐ పర్సన్‌ టు మర్చంట్‌ (పీ2ఎం) విభాగం శరవేగంగా అభివృద్ధి చెందింది. నగరాలలో కంటే ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలలో పీ2ఎం లావాదేవీలు పెరిగాయని భారత్‌పే గ్రూప్‌ అధ్యక్షుడు సుహైల్‌ సమీర్‌ తెలిపారు. 

గతేడాది ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది మార్చి మధ్య కాలంలో యూపీఐ లావాదేవీ పరిమాణం ఏడు రెట్లు వృద్ధి చెందింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మార్చి మధ్య యూపీఐ చెల్లింపులు 23.7 శాతం పెరిగాయి. కరోనా నేపథ్యంలో దేశంలో డిజిటల్‌ చెల్లింపులు పెరిగాయని.. దీంతో గత 12 నెలల్లో భారత్‌పే సేవలు 30 నగరాల నుంచి వంద నగరాలకు విస్తరించామని పేర్కొన్నారు. 2022 ఆర్ధిక సంవత్సరంలో మరొక వంద నగరాలకు విస్తరించాలని లక్షించినట్లు తెలిపారు. అలాగే ప్రస్తుతం 40 లక్షలుగా ఉన్న మర్చంట్ల సంఖ్యను 60 లక్షలకు చేర్చాలని టార్గెట్‌ పెట్టుకున్నామని చెప్పారు. 2023 మార్చి నాటికి భారత్‌పే చెల్లింపుల వ్యాపారం మూడు రెట్లు వృద్ధితో 30 బిలియన్‌ డాలర్ల టీపీవీ (టోటల్‌ పేమెంట్స్‌ వ్యాల్యూ)కి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది.

చదవండి: బ్యాంకు ఖాతాదారులకి ఆర్‌బీఐ అలర్ట్!

మరిన్ని వార్తలు