వ్యాపారుల కోసం భారత్‌పే డిజిటల్‌ గోల్డ్‌

28 Oct, 2020 08:30 IST|Sakshi

న్యూఢిల్లీ: మర్చంట్‌ పేమెంట్‌ ప్లాట్‌ఫామ్‌ భారత్‌పే వ్యాపారుల కోసం ప్రత్యేకంగా డిజిటల్‌ బంగారం అమ్మకాన్ని ప్రారంభించింది.ఇందుకోసం సేఫ్‌గోల్డ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. సేఫ్‌గోల్డ్‌ డిజిటల్‌ ప్లాట్‌ఫాం ద్వారా వినియోగదారులు అతి తక్కువ పరిణామంలో  24 గంటలూ బంగారాన్ని కొనేందుకు, అమ్మేందుకు, డెలివరీ చేసేందుకు అవకాశం లభిస్తుంది. భారత్‌పేలో డిజిటల్‌ బంగారాన్ని ప్రారంభించడం ద్వారా వ్యాపారులకు అన్ని రకాల ఆర్థిక ఉత్పత్తులు పూర్తిగా అందుబాటులోకి వచ్చినట్లు   భారత్‌పే గ్రూప్‌ ప్రెసిడెంట్‌ సుహైల్‌ సమీర్‌ చెప్పారు.

డిజిటల్‌ బంగారాన్ని ప్రారంభించాల్సిందిగా వ్యాపారులు ఎప్పటినుంచో కోరుతున్నారని, ప్రారంభించిన తొలిరోజే  200 గ్రాముల బంగారం విక్రయం జరిగిందని తెలిపారు.ముందు ముందు డిజిటల్‌ బంగారానికి డిమాండ్‌ పెరుగుతుందని ఈ ఆర్థిక సంవత్సరం 30 కిలోల బంగారం విక్రయించాలని, దీపావళి నాటికి కనీసం 6 కిలోలు బంగారం అమ్మాలని  లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన వెల్లడించారు. వ్యాపారులు  భారత్‌పే యాప్‌ను ఉపయోగించడం ద్వారా  99.5 శాతం స్వచ్ఛత, 24 క్యారెట్ల బంగారాన్ని రోజులో ఏ సమయంలోనైనా, ఎక్కడి నుండైనా రూపాయి లేదా గ్రాములలో కొనుగోలు చేయవచ్చని తెలిపారు. వ్యాపారులు కొనుగోలు చేసిన బంగారం రక్షణకు సేఫ్‌గోల్డ్‌ ఐడిబిఐ ట్రస్టీషిప్‌ సేవలను వినియోగించుకుంటోంది.కొనుగోలు చేసిన బంగారాన్ని నూరు శాతం బీమాతో లాకర్లలో సురక్షితంగా ఉంచుతుంది.అంతర్జాతీయ మార్కెట్‌తో ముడిపడి ఉన్న బంగారం ధరల గురించి వ్యాపారులకు రియల్‌టైం వ్యూ అందుతుందని వారు కొనుగోలు చేసే బంగారానికి జీఎస్‌టీ ఇన్‌పుట్‌ క్రెడిట్‌ కూడా లభిస్తుందని సమీర్‌ వివరించారు.

మరిన్ని వార్తలు