విద్యుత్‌ కోసం...భారతీ ఎయిర్‌టెల్‌ భారీ పెట్టుబడులు

27 Mar, 2022 21:19 IST|Sakshi

ప్రముఖ ప్రైవేట్‌ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ మహరాష్ట్రకు చెందిన ఎలక్ట్రిక్‌ యూటీలిటీ కంపెనీ అవాదా కేఎన్‌షోరాపూర్ ప్రైవేట్ లిమిటెడ్‌లో భారీగా పెట్టుబడులు పెట్టింది. సొంతంగా విద్యుత్ ఉత్పాదక కంపెనీలను కలిగివుండాలనే నిబంధనలో భాగంగా భారతి ఎయిర్‌టెల్‌ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. 

అవాదా కేఎన్‌షోరాపూర్‌లో 7 శాతానికిపైగా వాటాను రూ. 1.74 కోట్లతో వాటాలను కొనుగోలు చేసినట్లు భారతి ఎయిర్‌టెల్‌ ఆదివారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. కొనుగోలు ధర వివరాలను తెలియజేస్తూ...ఒక్కొ ఈక్వీటి షేర్‌కు రూ. 10 చొప్పున మొత్తం 17,42,650 ఈక్విటీ షేర్లను కొనుగోలు చేయడానికి మొత్తం రూ. 1,74,26,500 చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ తన ఫైలింగ్‌లో పేర్కొంది.   సొంత అవసరాల కోసం అవాదా కేఎన్‌షోరాపూర్ నుంచి విద్యుత్‌ను తీసుకుంటామని వివరించింది.

మల్టీ నేషనల్ కంపెనీలు  తమ విద్యుత్ అవసరాల కోసం సొంతంగా క్యాప్టివ్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యుత్ చట్టం 2003 ప్రకారం తన సొంత అవసరాల కోసం అవాదా కేఎన్‌షోరాపూర్ నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేసుకునేలా అందులో పెట్టుబడులు పెట్టింది. పెట్టుబడులను పెట్టడం ద్వారా వచ్చే రిటర్న్స్‌ను భారతి ఎయిర్‌టెల్ విద్యుత్ రూపంలో స్వీకరించే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి.

చదవండి: ఓటీటీ దెబ్బకు ఇండియన్‌ బిగెస్ట్‌ సినిమా బ్రాండ్ల విలీనం..!

మరిన్ని వార్తలు