Reliance Jio: జియో నుంచి ఎయిర్‌టెల్‌కు రూ.1,005 కోట్లు

14 Aug, 2021 06:26 IST|Sakshi

మూడు సర్కిళ్లలో జియోకు అదనపు స్పెక్ట్రమ్‌

న్యూఢిల్లీ: రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌తో ఒప్పందం పూర్తి చేసుకున్నట్టు ఎయిర్‌టెల్‌ ప్రకటించింది. ఇరు సంస్థల మధ్య కుదిరిన ఈ ఒప్పందంలో భాగంగా మూడు సర్కిళ్లలో ఎయిర్‌టెల్‌ ఆధీనంలో ఉన్న 800 మెగాహెర్జ్‌ స్పెక్ట్రమ్‌ను వినియోగించుకునే హక్కులు రిలయన్స్‌ జియోకు లభించినట్టు భారతీ ఎయిర్‌టెల్‌ తెలిపింది. ఇందుకు సంబంధించి రూ.1,005 కోట్లను అందుకున్నట్టు పేర్కొంది.

అలాగే, ఈ స్పెక్ట్రమ్‌కు సంబంధించి భవిష్యత్తులో రూ.469 కోట్ల చెల్లింపుల బాధ్యత కూడా జియోపై ఉంటుందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, ముంబై సర్కిళ్లలో జియోకు ఎయిర్‌టెల్‌ స్పెక్ట్రమ్‌ను వినియోగించుకునే అవకాశం లభించినట్టయింది. ఈ రెండు సంస్థలు ఈ ఒప్పందాన్ని ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రకటించడం గమనార్హం. 800 మెగాహెర్జ్‌ స్పెక్ట్రమ్‌ వల్ల జియో నెట్‌వర్క్‌ యూజర్లకు ఇండోర్‌ (భవనాల్లోపల) కవరేజీ మెరుగుపడనుంది.   

మరిన్ని వార్తలు