Bharti Airtel: ఈ ఏడాది మధ్యలో టారిఫ్‌ల పెంపు

28 Feb, 2023 00:21 IST|Sakshi

ఎయిర్‌టెల్‌ చీఫ్‌ మిట్టల్‌ వెల్లడి

బార్సెలోనా: ఈమధ్యే పలు దఫాలుగా ప్లాన్ల టారిఫ్‌లను పెంచిన టెలికం సంస్థ భారతి ఎయిర్‌టెల్‌ మరో విడత వడ్డింపునకు సిద్ధమవుతోంది.  పెట్టుబడులపై రాబడులు అత్యంత తక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ ఏడాది మధ్యలో టారిఫ్‌లను పెంచే అవకాశం ఉందని కంపెనీ చైర్మన్‌ సునీల్‌ మిట్టల్‌ తెలిపారు. దీనివల్ల అట్టడుగున ఉన్నవారిపై పడే ప్రభావంపై స్పందిస్తూ.. ప్రజలు మిగతా వాటిపై చేసే ఖర్చులతో పోలిస్తే పెంపు చాలా స్వల్పమే ఉంటుందని పేర్కొన్నారు. ‘ఒక్కటి తప్ప.. అన్నీ పెరిగాయి. జీతాలు .. అద్దెలు పెరిగాయి. ఎవరూ ఫిర్యాదు చేయడం లేదు. ప్రజలు 30 జీబీ డేటాను దాదాపు ఏమీ కట్టకుండానే వినియోగిస్తున్నారు. దేశంలో మరో వొడాఫోన్‌ తరహా పరిస్థితి తలెత్తకూడదు. మనకు ఒక భారీ టెలికం సంస్థ అవసరం‘ అని మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌లో పాల్గొన్న సందర్భంగా మిట్టల్‌ చెప్పారు.

కోటి మందికి ఎయిర్‌టెల్‌ 5జీ
టెలికం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌ కోటి మంది 5జీ చందాదార్లను సొంతం చేసుకుంది. 2024 మార్చి నాటికి దేశంలోని ప్రతి పట్టణం, ప్రధాన గ్రామీణ ప్రాంతాల్లో 5జీ సేవలను చేర్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు సోమవారం ప్రకటించింది. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో అడుగుపెట్టినట్టు తెలిపింది. ప్రపంచ స్థాయి 5జీ ప్లస్‌ అనుభూతిని అందించడానికి సరైన మార్గంలో ఉన్నట్టు విశ్వసిస్తున్నామని సంస్థ సీటీవో రన్‌దీప్‌ సిఖోన్‌ తెలిపారు. 2022 నవంబర్‌లో 10 లక్షల మంది కస్టమర్లు కంపెనీ 5జీ వేదికపైకి వచ్చారు. వాణిజ్య పరంగా సేవలు ప్రారంభించిన 30 రోజుల్లోనే ఈ ఘనతను సాధించామని ఎయిర్‌టెల్‌ తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న ఎయిర్‌టెల్‌ రిటైల్‌ స్టోర్లను 5జీ ఎక్స్‌పీరియెన్స్‌ జోన్స్‌గా తీర్చిదిద్దామని కంపెనీ వివరించింది.

మరిన్ని వార్తలు