స్పేస్ ఎక్స్ కు పోటీగా దూసుకెళ్తున్న వన్‌వెబ్

31 May, 2021 14:21 IST|Sakshi

న్యూఢిల్లీ: భారతి ఎయిర్‌టెల్ యాజమాన్యంలోని శాటిలైట్ కమ్యూనికేషన్ సంస్థ వన్‌వెబ్ 36 కొత్త లో ఎర్త్ ఆర్బిట్(లియో) ఉపగ్రహాలను ఈ రోజు ప్రయోగించినట్లు ప్రకటించింది. రష్యాలోని ఏరియన్‌స్పేస్‌ నుంచి ఇవి దూసుకెళ్లాయని తెలిపింది. ‘5 టు 50’ లక్ష్యంలో భాగంగా మరొక శాటిలైట్‌ను ప్రయోగించడం ద్వారా యూకే, అలస్కా, ఉత్తర యూరప్, గ్రీన్‌ల్యాండ్, కెనడావంటి దేశాలకు ఉపగ్రహ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్‌ను అందించనున్నట్టు కంపెనీ తెలిపింది. వాణిజ్య సేవలు 2022 నుంచి ప్రారంభం అవుతాయని వివరించింది. 

దీంతో కక్ష్యలోకి చేరిన మొత్తం శాటిలైట్ల సంఖ్య 218కి చేరుకుందని భారతి గ్రూప్‌ ప్రమోట్‌ చేస్తున్న ఈ కంపెనీ వెల్లడించింది. వన్‌వెబ్ గత మార్చి నెలలో ఇదే అంతరిక్ష కేంద్రం నుంచి 36 ఉపగ్రహాల ప్రయోగించింది. కంపెనీ తన సేవల్లో భాగంగా 648 లియో ఉపగ్రహాలను ప్రయోగించాలని యోచిస్తోంది. జూన్ 2021 నాటికి 50 డిగ్రీల అక్షాంశానికి ఉత్తరాన ఉన్న ప్రాంతాలకు సేవలను అందించడానికి కంపెనీ ఒక అడుగు దూరంలో ఉంది. వన్‌వెబ్, ఏరోస్పేస్ సంస్థ ఎయిర్‌బస్ జాయింట్ వెంచర్ కింద ఈ ఉపగ్రహాలను తయారు చేస్తున్నారు. ఏప్రిల్ చివరిలో వన్‌వెబ్ లో పారిస్ కు చెందిన యూటెల్సాట్ కమ్యూనికేషన్స్ 550 మిలియన్ డాలర్ల పెట్టుబడిని పెట్టింది. ఈ ఒప్పందంలో భాగంగా యుటెల్సాట్ వన్‌వెబ్‌లో 24శాతం వాటాను సొంతం చేసుకుంది. స్పేస్ ఎక్స్ కు పోటీగా వన్‌వెబ్ శాటిలైట్‌ ఇంటర్నెట్ అందించాలని చూస్తుంది.

చదవండి:  

నెలకు రూ.890 కడితే శామ్‌సంగ్ ఫ్రిజ్‌ మీ సొంతం!

>
మరిన్ని వార్తలు