మస్క్‌ ట్వీటేసిన మరుసటి రోజే టెస్లాకు ఝలక్‌

26 Jul, 2021 14:26 IST|Sakshi

అమెరికా వాహనాల దిగ్గజం టెస్లాకు భారత ప్రభుత్వం భారీ షాక్‌ ఇచ్చింది. ఈ మేరకు భారత్‌లో టెస్లాకు కంపెనీ సంబంధిత ప్రోత్సహకాలు ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. అంతేకాదు దిగుమతి సుంకంపై టెస్లాకు ఎలాంటి రాయితీలు ఉండబోవని, భవిష్యత్తులో అవి తగ్గే ప్రసక్తే లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. 

టెస్లా కంపెనీ ఈ ఏడాది జనవరిలో మన దేశంలోని బెంగళూరులో స్థానికంగా ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది.  అయితే ఇండియా అధిక దిగుమతి సుంకాలపై టెస్లా సీఈవో ఎలన్‌ మస్క్‌ ట్వీటేసిన మరుసటి రోజే.. కేంద్రం నుంచి ఇలాంటి ప్రతికూల సంకేతాలు రావడం విశేషం. ఈ మేరకు ఓ ప్రముఖ బిజినెస్‌ సైట్‌తో మాట్లాడిన సీనియర్‌ అధికారి ఒకరు.. ఆదివారం టెస్లా అభ్యంతరాలపై స్పందించారు. 

ఇండియాలో టెస్లా ఎంట్రీపై ఓ ఇండియన్‌ ట్విటర్‌ చేసిన ట్వీట్‌కు జులై 24న ఎలన్‌ మస్క్‌ బదులిచ్చాడు. భారత్‌ అధిక దిగుమతి సుంకాల వల్లే ఈ-వెహికిల్‌ మేకర్‌ అయిన తమకు ఎంట్రీ ఆటంకంగా మారిందని చెప్పాడు. అంతేకాదు ఒకవేళ టెస్లా వెహికిల్స్‌ దిగుమతికి లైన్‌ క్లియర్‌ అయితే.. ఫ్యాక్టరీ ఏర్పాటుకు అవకాశాలు ఉంటాయని సంకేతాలు ఇచ్చాడు కూడా. అంతకు కొన్నిరోజుల ముందు రూటర్స్‌లో ఓ కథనం.. ‘మస్క్‌ ఈ మేరకు భారత ప్రభుత్వంతో లాబీయింగ్‌ నడుపుతున్నాడ’ని పేర్కొంది. 
 
అయితే దేశంలో ఇప్పటికే ఈ-వెహికిల్స్‌ మీద సెక్టోరల్‌ ఇన్‌సెంటివ్స్‌.. అది కూడా స్థానిక(డొమెస్టిక్‌ మ్యానుఫ్యాక్చర్స్‌) కంపెనీలకే వర్తిస్తాయని స్పష్టం చేశాడు ఆ సీనియర్‌ అధికారి. ప్రస్తుతం సుమారు 30 లక్షల విలువ కంటే వాహనాలపై 60 శాతం, అంతకంటే ఎక్కువ ఉంటే వంద శాతం దిగుమతి సుంకాన్ని విధిస్తోంది భారత ప్రభుత్వం. దీంతో రీజనబుల్‌ ధరలతో టెస్లా భారత్‌లో ఎంట్రీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక టెస్లా మెయిన్‌ పోర్టల్ ప్రకారం మోడల్ 3 స్టాండర్డ్ రేంజ్ ప్లస్ మోడల్ ధర 40000 డాలర్ల కంటే తక్కువగా ఉంది. ఈ మేరకు సుంకాన్ని తగ్గించాలని టెస్లా కంపెనీ భారత ప్రభుత్వానికి ఓ లేఖ కూడా రాయడం విశేషం.

మరిన్ని వార్తలు