బిలియనీర్‌ అదానీ భారీ పెట్టుబడులు: అంబానీకి షాకేనా?

15 Sep, 2022 11:05 IST|Sakshi

 సాక్షి, ముంబై: బిలియనీర్ గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ  గ్రూప్  తన వ్యాపార సామాజ్యాన్ని మరింత విస్తరిస్తోంది. ముఖ్యంగా  ఫుడ్‌ బిజినెస్‌లో మరింత దూసుకుపోనుంది. ముఖ్యంగాఎఫ్‌ఎంసీజీ వ్యాపారంలోకి ప్రవేశిస్తున్నట్టు రిలయన్స్ ప్రకటించిన  తర్వాత ఆసియాలోని అత్యంత ధనవంతుడు తన సామ్రాజ్య ఆహార కార్యకలాపాలను రెట్టింపు చేసేలా, స్థానిక, విదేశీ కొనుగోళ్లపై దృష్టిపెట్టడం మార్కెట్‌ వర్గాల్లో చర్చకు దారి తీసింది.   

బిలియనీర్ గౌతమ్ అదానీ 400 బిలియన్ డాలర్ల విలువైన కొనుగోళ్లతో ఆహారవ్యాపారంలోకి   మరింత దూకుడుగా వస్తున్నారని  యూఎస్‌ ఫుడ్‌ అండ్‌ అగ్రి ఆర్గనైజేషన్‌ తెలిపింది. ఆసియాలోనే అత్యంత ధనవంతుడైన అదానీ తన రెట్టింపు ఆదాయాలను దేశీయ ఆహార ఉత్పత్తి పరిశ్రమలో వాటాల కొనుగోలుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొంది. అదానీకి చెందిన కిచెన్ ఎసెన్షియల్స్ సంస్థ అదానీ విల్మార్ లిమిటెడ్ తమ మార్కెట్‌ రీచ్‌ను పెంచడానికి ప్రధాన ఆహారాలు, పంపిణీ కంపెనీలలో బ్రాండ్‌లను కొనుగోలు చేయాలని చూస్తున్నామని అదానీ విల్‌మార్‌ సీఎండీ అంగ్షు మల్లిక్ బుధవారం ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

అంతేకాదు రానున్న మార్చి నాటికి రెండు డీల్స్‌ పూర్తి చేయనున్నామని కూడా మల్లిక్ వెల్లడించారు. ఇందుకు 5 బిలియన్ రూపాయలను కంపెనీ కేటాయించిందని చెప్పారు. ఏప్రిల్‌ నుంచి వచ్చే ఏడాదికి 30 బిలియన్‌ రూపాయల ప్రణాళికా బద్ధమైన మూలధన వ్యయంతో పాటు అంతర్గత నిల్వల నుంచి అదనపు నిధులు వస్తాయని చెప్పారు. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఇ-కామర్స్ పంపిణీలో  50 శాతం వృద్ధిని సాధిస్తోందని మల్లిక్ చెప్పారు. ఫిబ్రవరినుంచి తమ  ఫుడ్ కంపెనీ షేర్లు మూడు రెట్లు పెరిగియన్నారు. 

మెక్‌కార్మిక్ స్విట్జర్లాండ్ నుండి కోహినూర్ కుకింగ్ బ్రాండ్‌తో సహా పలు బ్రాండ్‌లను అదానీ విల్మార్ ఇటీవల కొనుగోలుచేసింది.తద్వారా కోహినూర్ బాస్మతి బియ్యం, రెడీ-టు-కుక్, రెడీ-టు-ఈట్ కూరలు, ఫుడ్‌పై ప్రత్యేక హక్కులు  పొందించింది.  అదానీ గ్రూప్ గత  ఏడాదిలో 17 బిలియన్‌ డాలర్ల విలువైన దాదాపు 32 కంపెనీలను కొనుగోలు చేసింది. కాగా రిలయన్స్ రీటైల్‌ వింగ్‌ రిలయన్స్ రిటైల్  సరసమైన ధరలకు అధిక నాణ్యత గల ఉత్పత్తులను అభివృద్ధి చేసి, డెలివరీ చేసే లక్ష్యంతో ఎఫ్‌ఎంసిజి వ్యాపారంలోకి  ఎంట్రీ ఇస్తున్నట్టు ఏజీఎంలో ప్రకటించింది.

మరిన్ని వార్తలు