ముఖేష్‌ అంబానీ రూ.11,100 కోట్ల ఇన్వెస్ట్‌, ఒప్పందం పూర్తి

30 Jun, 2021 00:26 IST|Sakshi

రువాయిస్‌ డెరివేటివ్‌ పార్క్‌లో భాగస్వామ్యం 

రూ. 11,100 కోట్ల పెట్టుబడుల అంచనాలు! 

క్లోర్‌ ఆల్కలీ, ఎథిలీన్‌ డైక్లోరైడ్, పీవీసీల తయారీ

న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌) యూఏఈలో నిర్మితమవుతున్న భారీ పెట్రోకెమికల్‌ కేంద్రం(హబ్‌)లో ఇన్వెస్ట్‌ చేసేందుకు అంగీకరించింది. ఇందుకు ఒప్పందంపై సంతకాలు చేసింది. పెట్టుబడి వివరాలు వెల్లడికానప్పటికీ 150 కోట్ల డాలర్లు(సుమారు రూ. 11,100 కోట్లు) ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు అంచనా. అబుధాబి ప్రభుత్వ ఇంధన దిగ్గజం అడ్నాక్, హోల్డింగ్‌ కంపెనీ ఏడీక్యూ సంయుక్తంగా ఏర్పాటు చేసిన టాజిజ్‌ జేవీ పశ్చిమ అబుధాబిలో రువాయిస్‌ డెరివేటివ్‌ పార్క్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ జేవీతో ముఖేష్‌ అంబానీ చేతులు కలపనున్నారు. ఈ ప్రాజెక్టులో పెట్టుబడికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆర్‌ఐఎల్‌ తెలియజేసింది. అయితే ఇన్వెస్ట్‌మెంట్‌ వివరాలు వెల్లడించలేదు. పార్క్‌కు సంబంధించి జత కలవగల భాగస్వాముల కోసం టాజిజ్‌ చర్చలు నిర్వహిస్తోంది. 2025కల్లా కార్యకలాపాలు ప్రారంభించే వీలున్న ఈ పార్క్‌ 500 కోట్ల డాలర్ల పెట్టుబడులను ఆకట్టుకోగలదని అంచనా. అబుధాబి జాతీయ చమురు కంపెనీ(అడ్నాక్‌) రోజుకి 3 మిలియన్‌ బ్యారళ్ల చమురును సరఫరా చేయనుంది. తద్వారా రువాయిస్‌లో డౌన్‌స్ట్రీమ్‌ కార్యకలాపాలకు తెరతీయనుంది. ఇందుకు వీలుగా భాగస్వాముల ద్వారా 45 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను వెచ్చించాలని ప్రణాళికలు వేసింది. డౌన్‌స్ట్రీమ్‌ కార్యకలాపాల అభివృద్ధిలో భాగంగా రిఫైనింగ్, పెట్రోకెమికల్‌ సామర్థ్యాలను భారీగా పెంచుకోవాలని చూస్తోంది.

చదవండి : Realme : రూ.7వేలకే 5జీ స్మార్ట్‌ఫోన్‌ ఎప్పుడో తెలుసా ?


ఆర్‌ఐఎల్‌ ప్రణాళికలు 
రువాయిస్‌లో చమురు రిఫైనరీతోపాటు.. పెట్రోకెమికల్‌ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని టాజిజ్‌ ప్రణాళికలు వేసింది. కాగా.. ఒప్పందంలో భాగంగా ఆర్‌ఐఎల్‌ ప్రపంచస్థాయి క్లోర్‌ ఆల్కలీ, ఎథిలీన్‌ డైక్లోరైడ్, పీవీసీ ఉత్పత్తి యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ఆర్‌ఐఎల్‌ సంతకాలు చేసినట్లు అడ్నాక్‌ తాజాగా పేర్కొంది. తద్వారా కీలకమైన పారిశ్రామిక ముడిసరుకులకు పెరుగుతున్న డిమాండ్‌ను అందిపుచ్చుకునేందుకు గ్లోబల్‌ ఇంధన దిగ్గజాలైన  రెండు సంస్థల శక్తి, సామర్థ్యాలను వినియోగించనున్నట్లు తెలియజేసింది. ఒప్పందం ప్రకారం టాజిజ్, ఆర్‌ఐఎల్‌ సంయుక్తంగా సమీకృత ప్లాంటును ఏర్పాటు చేయనున్నాయి. దీనిలో భాగంగా వార్షికంగా 9,40,000 టన్నుల క్లోర్‌ ఆల్కలీ, 1.1 మిలియన్‌ టన్నుల ఎథిలీన్‌ డైక్లోరైడ్, 3,60,000 టన్నుల పీవీసీ తయారీ సామర్థ్యాలు ఏర్పాటు కానున్నట్లు అడ్నాక్‌ వెల్లడించింది. ఈ వార్తల నేపథ్యంలో ఆర్‌ఐఎల్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 0.2 శాతం పుంజుకుని రూ. 2,090 వద్ద ముగిసింది. 

చదవండి: వాట్సాప్‌ నుంచి మనీ ట్రాన్స్‌ఫర్‌ చేయండిలా.!

మరిన్ని వార్తలు