ట్రెండ్‌ సెటర్‌ సీఈవో సరికొత్త చరిత్ర: గంటకు రూ.12 కోట్లు  

25 Feb, 2023 16:31 IST|Sakshi

వాషింగ్టన్: గంటకు 12 కోట్లు సంపాదించడం అంటే చిన్న విషయం కాదు కదా.  కానీ అమెరికాలోని ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ  బ్లాక్‌స్టోన్ సీఈవో స్టీఫెన్ స్క్వార్జ్‌మాన్ (76) ఈ ఫీట్‌ సాధించింది.  2022లో అత్యధిక సంపదను కూడబెట్టుకుని మరోసారి రికార్డు  క్రియేట్‌ చేశారు. గత ఏడాది ఏకంగా 1.27 బిలియన్ డాలర్లు సంపాదించారు.  2021లో స్క్వార్జ్‌మాన్ వార్షిక ఆదాయం 1.1 బిలియన్‌ డాలర్లుగా ఉంది. తాజా నివేదికల ప్రకారం ఇన్వెస్టింగ్ టైటాన్ స్క్వార్జ్‌మాన్  2022లో అతని సంపాదన గంటకు రూ. 12 కోట్లు. వాల్‌స్ట్రీట్‌లో ఆయనదే రికార్డు అని బిజినెస్‌ వర్గాలు  తెలిపాయి. 

బ్లాక్‌స్టోన్ షేర్లలో దాదాపు 20శాతం ఉన్న ఆయనకు 1 బిలియన్ డాలర్ల డివిడెండ్,  253.1 మిలియన్ల డాలర్ల ఇతర ప్రయోజనాలను పొందారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం బ్లాక్‌స్టోన్  సీఈవో నికర విలువ 30.6 బిలియన్ డాలర్లు. 2021లో ఏకంగా రూ.8,500 కోట్ల వేతనంతో వాల్‌స్ట్రీట్‌లో అత్యధిక వేతనం అందుకున్న సీఈవోగా రికార్డు బద్దలు కొట్టారు. 2022లో ఎస్ అండ్ పీ 500 8.2 శాతం క్షీణించగా, బ్లాక్‌స్టోన్‌ షేర్ల నష్టాలు  1.5 శాతానికి పరిమితం కావడం విశేషం.స్టీఫెన్‌ వారసుడు బ్లాక్‌స్టోన్ ప్రెసిడెంట్ జోన్ గ్రే, 2022లో 479.2 మిలియన్ల డాలర్లు ఆర్జించాడు.  బ్లాక్‌స్టోన్‌లో 3 శాతం వాటా, డివిడెండ్‌ ఆదాయం కలిపి 182.7 మిలియన్లు అతని నికర విలువకు చేరాయి. 

 కాగా స్టీఫెన్ స్క్వార్జ్‌మాన్ ఫిబ్రవరి 14,1947న జన్మించారు. 1985లో ఏర్పాటైన  బ్లాక్‌స్టోన్‌కు స్టీఫెన్ సహ వ్యవస్థాపకుడు. లెమాన్ బ్రదర్స్ మాజీ ఛైర్మన్, సీఈవో  పీటర్‌సన్‌తో కలిసి 1985లో ది బ్లాక్‌స్టోన్ గ్రూప్ అనే గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థను స్థాపించారు స్క్వార్జ్‌మాన్ .

మరిన్ని వార్తలు