ఐపీవోకు నెక్సస్‌ సెలెక్ట్‌ ట్రస్ట్‌

19 Nov, 2022 06:13 IST|Sakshi

దేశీయంగా తొలి రిటైల్‌ రంగ రీట్‌

రూ. 4,000 కోట్ల సమీకరణపై కన్ను

న్యూఢిల్లీ: గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ బ్లాక్‌స్టోన్‌ పెట్టుబడులున్న నెక్సస్‌ సెలెక్ట్‌ ట్రస్ట్‌ పబ్లిక్‌ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుమతించమంటూ క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాథమిక పత్రాలు దాఖలు చేసింది. తద్వారా 50 కోట్ల డాలర్లు(సుమారు రూ. 4,000 కోట్లు) సమీకరించే ప్రణాళికలు ప్రకటించింది. వెరసి దేశీయంగా పబ్లిక్‌ ఇష్యూకి వస్తున్న తొలి రిటైల్‌ రంగ రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌(రీట్‌)గా నిలవనుంది. కంపెనీకి 14 నగరాలలో నిర్వహణలోగల 17 షాపింగ్‌ మాల్స్‌ ఉన్నాయి. వీటిలో 3,000 స్టోర్స్‌ ఉన్నాయి. కోటి చదరపు అడుగుల ప్రాంతాన్ని కవర్‌ చేస్తున్న ఈ పోర్ట్‌ఫోలియో విలువ 300 కోట్ల డాలర్లుగా అంచనా. 2023 క్యాలండర్‌ ఏడాది తొలి అర్ధభాగంలో ఐపీవో చేపట్టే వీలున్నట్లు మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.  

మూడో రీట్‌..
నెక్సస్‌ సెలెక్ట్‌ బ్లాక్‌స్టోన్‌ పెట్టుబడులు గల మూడో రీట్‌కాగా.. తొలుత ఎంబసీ ఆఫీస్‌ పార్క్స్, తదుపరి మైండ్‌స్పేస్‌ బిజినెస్‌ పార్క్స్‌ రీట్‌లను వెలువరించిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగా ప్రజాదరణ పొందిన రీట్‌ను దేశీయంగా కొద్దికాలంక్రితమే అనుమతించారు. వీటి ద్వారా రియల్టీ ఆస్తుల విలువను అన్‌లాక్‌ చేయడంతోపాటు.. రిటైల్‌ ఇన్వెస్టర్ల పెట్టుబడులకూ వీలు కలుగుతుంది. ప్రస్తుతం దేశీ స్టాక్‌ ఎక్సే్ఛంజీలలో మూడు రీట్‌లు ఎంబసీ ఆఫీస్‌ పార్క్స్, మైండ్‌స్పేస్‌ బిజినెస్‌ పార్క్స్, బ్రూక్‌ఫీల్డ్‌ ఇండియా లిస్టయ్యాయి. అయితే ఇవి లీజ్‌డ్‌ ఆఫీస్‌ ఆస్తులుకాగా.. నెక్సస్‌ సెలెక్ట్‌ రిటైల్‌ రియల్టీ ఆస్తులతో కూడిన తొలి అద్దె ఆదాయ కంపెనీ కావడం గమనార్హం!

మరిన్ని వార్తలు