ఇలాంటి అత్యాచారం గురించి ఎక్కడా విని ఉండరు: మహిళ ‘అవతార్‌’పైనా అఘాయిత్యం.. పైగా ఫొటోలు తీశారు

6 Feb, 2022 14:14 IST|Sakshi

ప్రపంచంలో ఏదో ఒక మూల.. ప్రతీ నిమిషానికి మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఒంటరి మహిళలు మృగాల చేతిలో చితికిపోతున్నారు. కానీ, ఇప్పుడు చెప్పుకోబోయే ఘటన.. బహుశా ఇది వరకు విని, చదివి ఉండరు. వాస్తవిక ప్రపంచంలోనే కాదు.. వర్చువల్‌ ప్రపంచంలోనూ ఆడవాళ్ల భద్రతపై అనుమానాల్ని పెంచే ఘటన ఇది. పైగా అవి మరింత ఘోరంగా.. ఆందోళనకరంగా ఉంటాయనే విషయాన్ని రుజువు చేసింది ఇది.  

బ్రిటన్‌కు చెందిన ఓ మహిళ(43).. ఫేస్‌బుక్‌ మెటావర్స్‌ ‘హోరిజోన్‌ వెన్యూస్‌’పై సంచలన ఆరోపణలకు దిగింది. ఆ వేదికపై తాను గ్యాంగ్‌రేప్‌నకు గురయ్యానని ఆమె ఫిర్యాదు చేసింది. వర్చువల్‌ వరల్డ్‌లోకి జాయిన్‌ అయిన నిమిషానికే.. తనను ముగ్గురు-నలుగురు (మేల్‌ అవతార్స్‌) చుట్టుముట్టి బలాత్కారం చేశారని, ఆపై ఆ అఘాయిత్యాన్ని ఫొటోలు సైతం తీశారని ఆమె వాపోయింది.      

ఆర్తనాదాలు. అరణ్యరోదనే! 
అఘాయిత్యం జరుగుతున్న టైంలో తను గట్టిగట్టిగా అరిచినా.. స్పందన కరువైందని ఆమె వాపోయింది. ఆ సమయంలో చాలామంది లాగిన్‌లో ఉన్నారు. కానీ, నా అరుపులను ఎవరూ పట్టించుకోలేదు. పైగా నా అవతార్‌ మీద ఘాతుకానికి పాల్పడ్డ మగ అవతార్‌లు మృగాళ్లా ప్రవర్తించాయి. దుర్భాషలాడాయి.. నాపై దాడి చేశాయి. దుస్తులు చించేశాయి. ఏం జరుగుతుందో అర్థం కావడానికే నాకు కొన్ని నిమిషాలు పట్టింది. ఆ భయంకరమైన అనుభవంతో వెంటనే వర్చువల్‌ రియాలిటీ హెడ్‌సెట్‌ తీసేసి, లాగౌట్‌ అయ్యానని ఆమె పేర్కొంది.

 

ఇక ఘటనపై తన అనుభవాన్ని ఓ బ్లాగ్‌లో పంచుకున్న బాధితురాలు. వర్చువల్‌ ఘటనను అనవసరంగా సీన్‌ చేస్తోందని కొందరు అంటున్నారు. కానీ, వాస్తవాల నుంచి వర్చువల్‌ అనుభవాలు వేరు చేయలేవని ఆమె అంటోంది. అందుకే వర్చువల్ ప్రపంచంలోనూ అనుభవాలకు 'వాస్తవికత' ఉంటుందని పేర్కొంది. వర్చువల్‌ రియాలిటీలో ఎక్కువ మంది ఉన్నప్పుడు.. అక్కడ వాస్తవికతకు ఆస్కారం ఉంటుందని గుర్తుంచుకోవాలని, తనకు ఎదురైన అనుభవం వర్చువల్‌ ప్రపంచంలోనూ మరెవరికీ ఎదురు కాకూడదని ఆమె అంటోంది. ఇదిలా ఉంటే ఈ ఘటనపై స్పందించని ఫేస్‌బుక్‌ మెటావర్స్‌.. భద్రత విషయంలో మార్పులు చేస్తున్నట్లు ఆ మధ్య ఒక ప్రకటనతోనే సరిపెట్టింది.

సంబంధిత వార్త: పక్కన లేకున్నా.. ‘నన్ను బలవంతంగా వాటేసుకుని’!!

మరిన్ని వార్తలు