షేర్‌ మార్కెట్‌లో రికార్డుల హోరు.. 54 వేలు క్రాస్‌ చేసిన సెన్సెక్స్‌

4 Aug, 2021 11:43 IST|Sakshi

ముంబై: షేర్‌ మార్కెట్‌లో బుల్‌ రంకెలు వేస్తోంది. బుల్‌ జోరుతో షేర్‌ మార్కెట్‌లో కొత్త రికార్డులు నమోదు అవుతున్నాయి. ఇటు నిఫ్టీ, అటు సెన్సెక్స్‌లు లైఫ్‌టైం హైలను నమోదు చేశాయి. 

54 వేలు క్రాస్‌
బాంబే స్టాక్‌ ఎక్సేంజీలో సెన్సెక్స్‌ కొత్త ఎత్తులకు చేరుకుంది. తొలిసారిగా 54 వేల మార్క్‌ని క్రాస్‌ చేసింది. ఫస్ట్‌వేవ్‌ తర్వాత మార్కెట్‌ పరిస్థితులు చక్కబడటంతో ఈ ఏడాది ఆరంభంలో ఫిబ్రవరిలో తొలిసారిగా సెన్సెక్స్‌ 50 వేల మార్క్‌ని క్రాస్‌ చేసింది. అయితే ఆ తర్వాత సెకండ్‌ వేవ్‌ రావడంతో మార్కెట్‌ ఒడిదుడుకులకు లోనైంది. తాజాగా సెకండ్‌ ప్రభావం పూర్తిగా తగ్గడం, ఆర్థిక వ్యవస్త పుంజుకోవడంతో ఇన్వెస్టర్లు జోరుమీదున్నారు.దీనికి తోడు సెకండ్‌ క్వార్టర్‌ ఫలితాల్లో మెటల్‌, సాఫ్ట్‌వేర్‌, బ్యాంకింగ్‌ సెక్టార్‌లో చాలా కంపెనీలు మెరుగైన పనితీరు కనబరచడంతో మార్కెట్‌పై విశ్వాసం పెరిగింది. మరోవైపు విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు ప్రారంభించడం కూడా కలిసి వచ్చింది. దీంతో సెన్సెక్స్‌ 54 వేలు క్రాస్‌ చేసింది. 

బుల్‌ జోరు
నిన్న సాయంత్రం 53,823 పాయింట్లతో మార్కెట్‌ క్లోజయ్యింది. అయితే ఇన్వెస్టర్లు ఉత్సాహంగా ఉండటంతో ఈ రోజు మార్కెట్‌ ప్రారంభం కావడమే 54071 పాయింట్లతో మొదలైంది. ఇక అప్పటి నుంచి సెన్సెక్స్‌ జోరు కొనసాగుతూనే ఉంది ఉదయం 11:30 గంటల సమయానికి 505 పాయింట్లు లాభపడి 54,329 దగ్గర ట్రేడ్‌ అవుతోంది. ఇక మంగళవారం తొలిసారి 16వేల మార్క్‌ని క్రాస్‌ చేసిన నిఫ్టీ అదే జోరుని బుధవారం  కూడా కొనసాగిస్తోంది. 
 

మరిన్ని వార్తలు