టెలికాం దిగ్గజ సంస్థల విలీనం వాయిదా, అదే కారణం!

7 Apr, 2022 08:43 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశీయంగా అభివృద్ధి చేసిన 4జీ టెలికం నెట్‌వర్క్‌ను బీఎస్‌ఎన్‌ఎల్‌ త్వరలోనే అమల్లోకి తీసుకురానుంది. దేశవ్యాప్తంగా 1.12 లక్షల 4జీ టవర్లను బీఎస్‌ఎన్‌ఎల్‌ ఏర్పాటు చేయనున్నట్టు టెలికం మంత్రి అశ్విని వైష్ణవ్‌ లోక్‌సభకు తెలిపారు. 5జీ నెట్‌వర్క్‌ అమల్లోకి వచ్చిన తర్వాతే రైళ్లలోపల ఇంటర్నెట్‌ సదుపాయం అందుబాటులోకి వస్తుందన్నారు. 

ప్రస్తుతం 4జీ నెట్‌వర్క్‌లో రైళ్లు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు ఇంటర్నెట్‌లో అంతరాయాలు వస్తున్నట్టు చెప్పారు. ‘‘భారత శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు అభివృద్ధి చేసిన 4జీ నెట్‌వర్క్‌ త్వరలోనే అందుబాటులోకి రానుంది. దీనికి ప్రపంచవ్యాప్త ప్రశంసలు వచ్చాయి. బీఎస్‌ఎన్‌ఎల్‌ ముందుగా 6 వేల టవర్లకు ఆర్డర్‌ ఇవ్వనుంది. ఆ తర్వాత మరో 6,000. అనంతరం లక్ష 4జీ టవర్లు ఏర్పాటు చేస్తుంది’’ అని చెప్పారు. 

బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్‌ విలీనం వాయిదా 
ప్రభుత్వరంగ టెలికం సంస్థలైన బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్‌ విలీనాన్ని ఆర్థిక కారణాల దృష్ట్యా వాయిదా వేసినట్టు కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి దేవుసిన్హ చౌహాన్‌ రాజ్యసభకు తెలిపారు. భారత్‌ బ్రాడ్‌బ్యాండ్‌ నెట్‌వర్క్‌ లిమిటెడ్‌ (బీబీఎన్‌ఎల్‌), భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌) ప్రతిపాదిత విలీనం పరిశీలనలో ఉన్నట్టు చెప్పారు. ఎంటీఎన్‌ఎల్‌కు అధిక రుణభారం ఉండ డం సహా ఆర్థిక కారణాలు ఎంటీఎన్‌ఎల్, బీఎస్‌ఎన్‌ఎల్‌ విలీనం వాయిదాకు కారణమని చెప్పారు.    

మరిన్ని వార్తలు