నవంబర్‌ నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ నెట్‌వర్క్‌

4 Oct, 2022 07:16 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ నవంబర్‌ నుంచి తమ 4జీ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తేనుంది. వచ్చే ఏడాది ఆగస్టు నాటికి క్రమంగా దాన్ని 5జీకి అప్‌గ్రేడ్‌ చేసుకోనుంది. ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌లో పాల్గొన్న సందర్భంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ సీఎండీ పి.కె. పుర్వార్‌ ఈ విషయాలు తెలిపారు. 

18 నెలల్లో 1.25 లక్షలకు పైగా 4జీ మొబైల్‌ సైట్లను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు వివరించారు. దేశీ 4జీ టెక్నాలజీని వినియోగించేందుకు ఐటీ దిగ్గజం టీసీఎస్, ప్రభుత్వ రంగ టెలికం పరిశోధన సంస్థ సీ–డాట్‌ సారథ్యంలోని కన్సార్షియంతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు.

 2023 ఆగస్టు 15 నాటికి బీఎస్‌ఎన్‌ఎల్‌ 5జీ కార్యకలాపాలు ప్రారంభించాలంటూ టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ నిర్దేశించారని, తదనుగుణంగా కృషి చేస్తున్నామని పుర్వార్‌ పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు