Income Tax: కేంద్రం దీనికి ఓకే అంటే.. పన్ను చెల్లింపుదారులకు పండగే!

18 Dec, 2022 12:11 IST|Sakshi

మరి కొన్ని రోజుల్లో న్యూ ఇయర్‌ రాబోతోంది. ప్రతి సంవత్సరం మాదిరే ఈ సారి కేంద్ర ప్రభుత్వం కొత్త బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది. ఈ ఏడాది బడ్జెట్‌లో వివిధ రంగాలకు చెందిన నిపుణులు తమ డిమాండ్లను పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే పరిశ్రమల సంస్థ అసోచామ్ తన ప్రీ-బడ్జెట్ సిఫార్సులలో కేంద్రానికి ఓ కీలక అంశాన్ని నివేదించింది. అది కోట్లాది మంది పన్ను చెల్లింపుదారులపై ప్రభావం చూపుతుందని తెలిపింది.

ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రాబోయే బడ్జెట్‌లో రూ. 5 లక్షలు చేయాలని పరిశ్రమల సంఘం అసోచామ్ తమ బలమైన వాదనను కేంద్రానికి వినిపించింది. తద్వారా ఆర్థిక వ్యవస్థ వినియోగ వృద్ధిని పొందుతుందని పేర్కొంది. ప్రస్తుతం ఆదాయపు పన్ను శ్లాబ్ ప్రకారం గరిష్ట ఆదాయం రూ. 2.5 లక్షలు వరకు ఎటువంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. 60-80 సంవత్సరాల వయస్సు గల వ్యక్తుల విషయంలో, ఇది రూ. 3 లక్షలు  ఉండగా 80 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు రూ. 5 లక్షలు ఉంది. 

ఈ సందర్భంగా అసోచామ్ ప్రెసిడెంట్ సుమంత్ సిన్హా మీడియాతో మాట్లాడుతూ.. స్టీల్, సిమెంట్ వంటి రంగాలలోని కంపెనీలు ప్రస్తుత సామర్థ్యాలను పెంచుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేయడం ప్రారంభించాయని అభిప్రాయపడ్డారు. ప్రతికూల నష్టాల గురించి మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా, ప్రపంచం మాంద్యంలోకి వెళ్లవచ్చని, అది బాహ్య రంగాన్ని ప్రభావితం చేస్తుందని, అందువల్ల భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (GDP)పై ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు.

ప్రత్యక్ష, పరోక్ష పన్నులు రెండింటిలోనూ ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని పెంచేందుకు ప్రభుత్వానికి తగినంత సమయం ఇవ్వాలన్నారు. భారత్‌ ప్రధాన ఇంధన ఉత్పత్తిదారుగా అవతరించేందుకు కృషి చేస్తున్నందున గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి మద్దతుగా ఇతర దేశాలు తీసుకుంటున్న క్రియాశీల చర్యలకు ప్రభుత్వం తప్పనిసరిగా స్పందించాలని చెప్పారు.

చదవండి: ఇది మరో కేజీఎఫ్‌.. రియల్‌ ఎస్టేట్‌ సంపాదన, భవనం మొత్తం బంగారమే!

మరిన్ని వార్తలు