Union Budget 2023: కేంద్రం శుభవార్త.. రైతులకు ఇస్తున్న సాయం పెంచనుందా!

27 Jan, 2023 15:51 IST|Sakshi

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఈ ఏడాది బడ్జెట్‌ ప్రత్యేకత సంతరించుకుంది. 2024లో సార్వత్రిక ఎన్నికల జరగనున్న నేపథ్యంలో మోదీ సర్కార్‌ ప్రవేశపెట్టే చివరి పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే. దీంతో ఈ బడ్జెట్‌లో అన్ని వర్గాలు ఆశించినే మేరకు వరాల జల్లు కురిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బడ్జెట్‌లో ముఖ్యంగా రైతులకు ప్రయోజనం చేకూర్చే విధంగా కీలక ప్రకటనలు ఉండవచ్చని సమాచారం.

వేలాది మంది రైతులు ఎదురుచూస్తున్న 13వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనను త్వరలో విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ పథకంలో భాగంగా, భూమిని కలిగి ఉన్న అన్ని రైతు కుటుంబాలకు మూడు సమాన వాయిదాలలో సంవత్సరానికి రూ. 6,000 అందిస్తోంది కేంద్రం. దీనికి సంబంధించి ఈ పథక లబ్ధిదారులైన రైతులకు కేంద్రం శుభవార్త చెప్పనున్నట్లు సమాచారం. నివేదిక ప్రకారం ఈ బడ్జెట్‌లో రైతులకు అందిస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం వాయిదా మొత్తాన్ని పెంచే అవకాశం ఉంది.

గతంలో ఈ పథకం కింద ఏడాదికి రూ.6వేలు నగదుని 3 వాయిదాలో కేంద్రం రైతు బ్యాంకు ఖాతాలో జమ చేసేది. తాజాగా ఆ మొత్తాన్ని రూ.8వేలకు పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తద్వారా రైతులకు ఇచ్చే మొత్తాన్ని రూ.2వేలు చొప్పున 4 విడతలుగా విభజించనుంది. ఈ బడ్జెట్ సందర్భంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ దీనిపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.

చదవండి: Union Budget 2023: కేవలం 800 పదాల్లో బడ్జెట్‌ను ముగించిన ఆర్థిక మంత్రి.. ఎవరో తెలుసా!

మరిన్ని వార్తలు