‘ఇంటి’పై ఎల్‌టీసీజీ పరిమితి రూ.10 కోట్లే

2 Feb, 2023 09:34 IST|Sakshi

ఇల్లు లేదా ఇతర క్యాపిటల్‌ అసెట్స్‌ కొనుగోలు చేసి విక్రయించగా వచ్చే దీర్ఘకాల మూలధన లాభాలపై (ఎల్‌టీసీజీ) పన్ను మినహాయింపునకు ఆర్థిక మంత్రి సీతారామన్‌ పరిమితి తీసుకొచ్చారు. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్‌ 54, 54ఎఫ్‌ కింద గరిష్టంగా 10 కోట్ల మొత్తానికే పన్ను మినహాయింపు పరిమితం చేశారు. అంటే ఒక ఇల్లు లేదా ఇతర క్యాపిటల్‌ పెట్టుబడులను విక్రయించినప్పుడు వచ్చే దీర్ఘకాల మూలధన లాభాన్ని, మరో ఇంటిని కొనుగోలు చేయడం ద్వారా పన్ను లేకుండా చేసుకోవచ్చు.

కాకపోతే ఈ మూలధన లాభం రూ.10కోట్లకు మించి ఉంటే ఆ మొత్తంపై ఇక మీదట పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మరీ ఖరీదైన ఆస్తుల కొనుగోలుపై పన్ను మినహాయింపులు తగ్గించేందుకే ఇలా చేశారు. పన్నుల్లో రాయితీలు, మినహాయింపులను మరింత మెరుగ్గా మార్చే లక్ష్యంతో రూ.10 కోట్లకు పరిమితం చేసినట్టు మంత్రి చెప్పారు. ఇందులో సెక్షన్‌ 54 అన్నది ఒక ఇంటిని అమ్మగా వచ్చే దీర్ఘకాల మూలధన లాభాన్ని తీసుకెళ్లి మరో ఇంటి కొనుగోలు చేయడం ద్వారా మినహాయింపునకు సంబంధించినది.

చదవండి: డిజిటల్‌ సీతారామం.. సూపర్‌ హిట్‌! 

మరిన్ని వార్తలు