ఆ కార్ల కొనుగోలుదారులకు షాక్‌.. పెరగనున్న ధరలు!

2 Feb, 2023 07:49 IST|Sakshi

న్యూఢిల్లీ: విదేశాల్లో పూర్తిగా తయారై (కంప్లీట్‌లీ బిల్ట్‌ యూనిట్స్‌/సీబీయూ) భారత్‌లోకి దిగుమతి అయ్యే ఎలక్ట్రిక్‌ కార్లు సహా అన్ని రకాల కార్లపై కస్టమ్స్‌ డ్యూటీ పెంచారు. విదేశాల్లో పూర్తిగా తయారైన వాటిని ‘సీబీయూ’లుగా చెబుతారు. 40,000 డాలర్ల కంటే తక్కువ ధర (ఇన్‌వాయిస్‌ వ్యాల్యూ) ఉన్నవి లేదంటే ఇంజిన్‌ సామర్థ్యం 3,000 సీసీ కంటే తక్కువ ఉన్న పెట్రోల్‌ కార్లు, 2,500 సీసీ కంటే తక్కువ సామర్థ్యం ఉన్న డీజిల్‌ ఇంజిన్‌ కార్లపై కస్టమ్స్‌ డ్యూటీని 60% నుంచి 70%కి పెంచారు.

ఎలక్ట్రిక్‌ కార్లు  40,000 డాలర్లకు పైన ధర ఉంటే వాటిపై కస్టమ్స్‌ డ్యూటీని 60% నుంచి 70%కి పెంచారు. సెమీ నాక్డ్‌ డౌన్‌ (ఎస్‌కేడీ/పాక్షికంగా తయారైన) కార్లపై (ఎలక్ట్రిక్‌ సహా) కస్టమ్స్‌ డ్యూటీని 30% నుంచి 35%కి పెంచారు. ప్రస్తుతం విదేశాల్లో తయారై దిగుమతి అయ్యే కార్లు 40,000 డాలర్లు లేదా ఇంజిన్‌ సామర్థ్యం 3,000 సీసీ కంటే ఎక్కువ ఉన్న పెట్రోల్‌ కార్లు, 2,500 సీసీ మించిన∙డీజిల్‌ కార్లపై 100% కస్టమ్స్‌ డ్యూటీ ఉంది.

2 శాతం వరకు పెరగనున్న ధరలు 
ప్రభుత్వం కస్టమ్స్‌ సుంకం పెంపు ప్రతిపాదనలతో కార్ల ధరలు 2 శాతం వరకు పెరుగుతాయని లగ్జరీ కార్ల తయారీ సంస్థలైన బీఎండబ్ల్యూ, మెర్సెడెజ్‌ బెంజ్, లెక్సస్‌ ప్రకటించాయి. బేసిక్‌ కస్టమ్స్‌ డ్యూటీ ప్రభుత్వం సవరించడంతో, ఎస్‌ క్లాస్‌ మేబ్యాచ్, జీఎల్‌బీ, ఈక్యూబీ ధరలపై ప్రభావం పడుతుందని మెర్సెడెజ్‌ బెంజ్‌ ఇండియా ఎండీ, సీఈవో సంతోష్‌ అయ్యర్‌ తెలిపారు. భారత్‌లోనే ఎక్కువ తయారీ చేస్తున్నందున 95 శాతం మోడళ్ల ధరలపై ప్రభావం ఉండదని చెప్పారు.

చదవండి: Union Budget 2023-24 బీమా కంపెనీలకు షాక్‌, రూ. 5 లక్షలు దాటితే!

మరిన్ని వార్తలు