బంపర్‌ టూ బంపర్‌ ఇన్సురెన్స్‌ తప్పనిసరి..మద్రాస్‌ హైకోర్టు సంచలన తీర్పు..

27 Aug, 2021 10:09 IST|Sakshi
మద్రాస్‌ హైకోర్టు ( ఫైల్‌ ఫోటో )

Madras High Court: వాహనాలకు సంబంధించిన ఇన్సురెన్సులు చేసేప్పుడు ఇటు కొనుగోలుదారులు, అటు ఇన్సురెన్సు కంపెనీలు బాధ్యతగా వ్యవహరించాలంటూ మద్రాస్‌ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. వాహనం నడిపే వారి సంక్షేమాన్ని పరిగణలోకి తీసుకుని బంపర్‌ టూ బంపర్‌ ఇన్సురెన్సును తప్పనిసరిగా చేసింది.

మద్రాస్‌ హైకోర్టు తీర్పు ఏంటీ
మద్రాసు హైకోర్టు తీర్పు ప్రకారం 2021 సెప్టెంబరు 1 నుంచి  కొనుగోలు చేసే కొత్త వాహనాలకు బంపర్‌ టు బంపర్‌ ప్రాతిపదికన వాహన యజమాని, డ్రైవరు, ప్రయాణికులందరికీ వర్తించేలా బీమా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ బీమా కాలపరిమితి ఐదేళ్లుగా ఉండాలని నిర్దేశించింది. లక్షల రూపాయలు పెట్టి వాహనం కొనేప్పుడు మైలేజీ, పవర్‌, డిజైన్‌లపై ఉన్న శ్రద్ధ తమపై కూడా పెట్టాలని వాహన కొనుగోలుదారులకు సూచించింది. కొద్దిపాటీ ప్రీమియం కట్టేందుకు నిర్లక్క్ష్యం చేస్తే, అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందంటూ కోర్టు అభిప్రాయపడింది.

తీర్పుకు కారణం ఇది
తమిళనాడులోని హొగినేకల్‌లో 2016లో జరిగిన రోడ్డు ప్రమాదంలో సడయప్పన్‌ అనే వ్యక్తి మృతి చెందాడు. దీనిపై  నష్టపరిహారం కోరుతూ కుటుంబ సభ్యులు ఈరోడ్‌ మోటారు వాహన ప్రమాద పరిహార ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు.  విచారణ అనంతరం సడయప్పన్‌ కుటుంబానికి రూ.14,.65 లక్షలు పరిహారం చెల్లించాలని ఇన్సురెన్సు కంపెనీని ట్రిబ్యునల్‌ ఆదేశించింది. దీన్ని వ్యతిరేకిస్తూ  న్యూ ఇండియా అస్యూరెన్స్‌ కంపెనీ మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించింది. వాహన డ్రైవరు, యజమాని అనే ప్రాతిపదికన మాత్రమే వాహనానికి థర్డ్‌ ఫార్టీ బీమా చేశారని.. డ్రైవరు కాని వ్యక్తి మృతి చెందితే లక్ష రూపాయలు మాత్రమే పరిహారం చెల్లిస్తామని బీమా సంస్థ తెలిపింది. సడయప్పన్‌ ప్రమాద సమయంలో వాహనం నడపలేదని రుజువులు చూపింది.  ఈ కేసును విచారించిన  న్యాయమూర్తి వైద్యనాథన్‌ ఈరోడ్‌ ట్రైబ్యునల్‌ ఆదేశాలను రద్దు చేశారు. అంతేకాకుండా ప్రీమియం, కవరేజీలు తక్కువగా ఉండే థర్డ్‌ పార్టీ ఇన్సురెన్సులను నిరసించారు. వాహన యజమాని, డ్రైవరుతో పాటు అందులో ప్రయాణించే అందరి సంక్షేమాన్ని కాంక్షిస్తూ బంపర్‌ టూ బంపర్‌ ఇన్సురెన్సుని తప్పనిసరి గా చేస్తూ తీర్పు ఇచ్చారు. 

చదవండి: ఆటో విడిభాగాల పరిశ్రమ జోరు, పీవీ - ట్రాక్టర్లకు డిమాండ్‌

మరిన్ని వార్తలు